EAST GODAVARI - EAGLE NEWS

EAST GODAVARI

తూర్పు గోదావరి జిల్లా చరిత్ర

కోడి పందాలు…పంట పొలాలు…అనగానే గుర్తోచేది తూ.గో.. అంటే తూర్పు గోదావరి జిల్లా… ఈ ప్రాంతాన్ని తొలుత మౌర్యులు, నందులు పరిపాలించగా, 5 వ శతాబ్దంలో విష్ణుకుండినులు ఏలినారు. సముద్రగుప్తుని దండయాత్ర తరువాత ఇక్కడ 375-500 వరకు మధరాకుల సామ్రాజ్యం పాలన సాగింది.  7 వ శతాబ్దంలో తూర్పు చాళుక్యుల పరిపాలనలో దాక్షరామంలో భీమారామం ఆలయ నిర్మాణం జరిగింది.  1295వ సంవత్సరంలో ప్రతాప రుద్రుడు కాకతీయ సింహాసనం అధిష్ఠించినప్పటికీ ఢిల్లీ సుల్తానులతో అనేక పోరాటాలను ఎదుర్కొన్నాడు. 1323 సంవత్సరంలో రుద్రుడు మహ్మద్-బీన్-తుగ్లక్ చేతిలో ఓడిపోయిన అనంతరం ఈ ప్రాంతం ఢిల్లీ సుల్తానుల ఆదిపత్యంలోకి వెళ్ళింది. చాళుక్య  చోళులు, వెలనాటి చోడులు, కాకతీయలు, ఢిల్లీ సుల్తానులు, విజయనగర రాజులు, కళింగ రాజులు, రెడ్డి రాజులు,గజపతులు, గోల్కొండ నవాబుల పాలన తర్వాత బ్రిటీషు వారి ఏలుబడిలోకి  వచ్చింది. ఆ తర్వాత  1953 వ సంవత్సరంలో మద్రాస్ రాష్ట్రం నుండి తెలుగు భాష మాట్లాడే జిల్లాలతో కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రా రాష్ట్రంలో భాగమైంది. గోల్కొండ పాలకుడు కుతుబ్ షాహి రాజ్యంలో  ఏర్పడిన అననుకూల పరిస్థితులను తనకూలంగా మలచుకుని సుల్తాన్ కూలి కుతుభ్ షాహి కోస్తా ప్రాంతం మీద దండయాత్ర చేసి రాజమండ్రి, దాని పరిసర రాజ్యాలను కైవశం చేసుకున్నాడు. సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు, లోక్ సభ స్పీకర్ గంటి మోహన్ చంద్ర బాలయోగి, నటులు అలీ, రవితేజ ఈ జిల్లాకు చెందినవారే.

విభజన తర్వాత….

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 7 రెవెన్యూ డివిజన్లు, 64 మండలాలు, 57 మండల ప్రజా పరిషత్తులు, 9 కార్పొరేషనులు  ఉండేవి. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత  2022  సంవత్సరంలో ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఉమ్మడి జిల్లాలో దక్షిణంగా ఉన్న ప్రాంతాలను కలిపి కాకినాడ జిల్లాగా, ఉత్తరం వైపు ఉన్నా గిరిజన ప్రాంతాలను అల్లూరి సీతారామరాజు జిల్లాగా మార్చారు.