KADAPA - EAGLE NEWS

KADAPA

కడప జిల్లా చరిత్ర…

చరిత్రకారులు, ఆధ్యాత్మిక పెద్దలు చెబుతున్నదాన్ని బట్టి దేవదేవుడు ఆ తిరుమలేశుని తొలి గడప కావడం వల్లే కడప అనే పేరు వచ్చిందనేది ప్రచారంలో ఉంది.స్థలపురాణం ప్రకారం ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామిని కృపాచార్యులు  ప్రతిష్టించడం వల్ల ఈ పట్టణానికి కృపాపురం, కృపనగరం అని పేరు వచ్చింది. కృపనగరంలోని కృప అన్న పదం ఉచ్చారణ క-రి-ప గా, చివరకు అదే  కడపగా మారిందనేది మరో విశ్లేషణ. కడప ప్రాంతం 11 నుండి 14వ శతాబ్దాల వరకు చోళుల పరిపాలనలో భాగంగా ఉండేది.   ఇది 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలో భాగంగా మారింది.   పెమ్మసాని తిమ్మయ్య నాయుడు ఈ ప్రాంతంలో పలు దేవాలయాలను, నీటిని నిల్వ ఉంచే తొట్లని కట్టి అభివృద్ధి చేపట్టాడు. 1594 లో రెండవ మీర్ జుమ్లా ఈ ప్రాంతాన్ని ఆక్రమణ చేసి చిన్న తిమ్మయ్య నాయుడిని మోసంతో గెలవటంతో ఇది గోల్కొండ ముస్లిముల పరమైనది. తర్వాత 1800వ సంవత్సరంలో  బ్రిటిషు వారి పాలనలోకి వెళ్ళింది. అమిన్ పీర్ దర్గా ఈ జిల్లాలోనిదే. జననేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి స్మారకార్ధం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  2010 జూలై 8 నుండి ఈ జిల్లా పేరును వై.ఎస్.ఆర్. జిల్లాగా మార్చింది. కన్నాంబ, పద్మనాభం, జయదేవ్, వై.ఎస్. రాజశేఖర రెడ్డి, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ జిల్లాకు  చెందినవారే

విభజన తర్వాత…

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  2022 వ సంవత్సరంలో  చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ జిల్లాను విభజించి కొత్తగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేశారు. ఉమ్మడి కడప జిల్లలో రెండు లోక్ సభ, 8 శాసన సభ స్తనాలు ఉండేవి. రాజంపేట నియోజక వర్గంలోని కొన్ని మండలాలను విదదీసి అన్నమయ్య జిల్లాలో కలిపారు. 36మండలాలు ఉన్న ఈ జిల్లా జనాభా సుమారు 22లక్షలు.