తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 72వ ప్రపంచ సుందరి పోటిల నుంచి మిస్ ఇంగ్లాండ్ 2025 – మిల్లా మాగీ వైదొలగడం , అనంతరం ఆమె నిర్వాహకులపై అభ్యంతర కర వ్యాఖ్యలు చెయాడం చర్చగా మారింది. అయితే దీనిపై మిస్ వరల్డ్ సంస్థ స్పందించింది. ఇటీవల బ్రిటిష్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాలపై సంస్థ ఛైర్పర్సన్ జూలియా మోర్లే మాట్లాడారు. ఈ నెల ప్రారంభంలో, మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ తన తల్లి, కుటంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి అత్యవసర పరిస్థితి కారణంగా ఈ పోటీల నుంచి విరమించుకోవాలని సంస్థను కోరినట్లు ఆమె తెలిపారు. మిల్లా పరిస్థితిని అర్థం చేసుకొని జూలియా మోర్లే వెంటనే స్పందించి, ఆమె కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని ప్రథమ ప్రాధాన్యతగా పరిగణించారు. తక్షణమే ఆమెను ఇంగ్లాండ్కు తిరిగి పంపే ఏర్పాట్లు చేసినట్లు ఆమె వివరించారు. మిస్ మిల్లా మిస్ వరల్డ్ పోటీల నుండి వైదొలిగిన తర్వాత, మిస్ ఇంగ్లాండ్ 1వ రన్నరప్ అయిన మిస్ షార్లెట్ గ్రాంట్ ఆమె ఇంగ్లాండ్ తరపున ప్రాతినిధ్యం వహించేందుకు ముందుకొచ్చారని జూలియా మోర్లే ఆ ప్రకటనలో తెలిపారు.
మిస్ షార్లెట్ బుధవారం ఇండియా కు చేరుకున్నారని, మిస్ వరల్డ్ సోదరభావంతో ఆమెను పోటీలలో పాల్గొనటకు అనుమతించడం జరిగిందని ఈ పోటీలలో ఆమె పాల్గొంటున్నారని తెలిపారు. ఇటీవల బ్రిటిష్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాలపై, కొన్ని ఇంగ్లాండ్ మీడియా సంస్థలు మిల్లా మాగీ పోటీలలో ఎదుర్కొన్న అనుభవాలపై తప్పుడు, అపవాదకరమైన కథనాలను ప్రచురించినట్లు సంస్థకు తెలియడంతో ఆ ఆరోపణలను ఖండిస్తూ, ఆ కథనాలు పూర్తిగా నిరాధారమైనవని జూలియా మోర్లే చెప్పారు. పోటీల ప్రారంభ సమయంలో మాగీ స్వయంగా వ్యక్తపరిచిన భావాలు, ఎడిట్ చేయని వీడియో క్లిప్ లను మిస్ వరల్డ్ సంస్థ విడుదల చేసింది. అందులో ఆమె ఆనందాన్ని, కృతజ్ఞతను, ఈ అనుభవాన్ని మెచ్చుకుంటూ మాట్లాడిన దృశ్యాలు కూడా ఉన్నాయి. తాజాగా ప్రచురితమైన తప్పుడు కథనాలు నిరాధారమైనవని, ఆ ఆరోపణలను ఖండిస్తూ జూలియా మోర్లే ఆ ప్రకటనలో వివరించారు. మిస్ వరల్డ్ సంస్థ నిజాయితీ, గౌరవం, “బ్యూటీ విత్ ఎ పర్పస్” అనే విలువలకు నిబద్ధంగా పోటీలు కొనసాగుతున్నాయి.