
దేశ అభివృద్ధిలో యువత గొప్ప పాత్ర పోషిస్తుందని, దేశ పురోగమనంతో పాటు సామాజిక సంస్కరణలను తీసుకురావడంలో యువతదే ప్రధాన పాత్రని డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. అక్షయ విద్య స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నగరంలోని పలు బస్తీలకు చెందిన 80 మంది నిరుపేద విద్యార్థినీ, విద్యార్థులకు లాప్ టాప్ లను డీజీపీ అందచేశారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ, కస్టపడి చదువుకున్న యువత తమ బస్తీలలో ప్రాంతాల్లో చేడు మార్గాలలో పయనిస్తున్న తమ తోటి యువకులను గుర్తించి వారిని సరైన మార్గంలో పయనించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి అంటే కేవలం పెద్ద, పెద్ద భవనాలు రావడం మాత్రమే కాదని, సమాజంలోని అట్టడుగు వర్గాలను అభివృద్ధి పథంలోకి తేవడం కూడా ప్రధానమని తెలిపారు. తాము మంచి ఉద్యోగాలు సాధించిన అనంతరం ఇతరులకు సహాయపడే గుణాన్ని అలవాటు చేసుకోవాలని డీజీపీ అన్నారు. యువత దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని, ఇదే సమయంలో కొంతమంది యువత చెడు మార్గాలవైపు ఆకర్షితులవుతున్నారని, వారిని మార్చేదుకు చిత్త శుద్దితో ప్రయత్నించాలని యువతను కోరారు. తెలంగాణా దేశంలో 5 వ అతిపెద్ద ఆర్థికాభివృద్ది కలిగిన రాష్ట్రమని, కష్టపడి చదివితే ఐటి, ఫార్మా, మానవ వనరుల రంగాల్లో అత్యధిక ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. శాస్త్ర, సాంకేతిక రంగమైనా, క్రీడా రంగమైనా ఏ ఇతర రంగాలైన పురోగమించాలంటే యువతదే కీలక పాత్ర అని అన్నారు. ఈ పాత్రను సరిగ్గా పోషించడంలో యువతకు సహాయం చేయడంలో స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న తోడ్పాటు ప్రశంసనీయమని అన్నారు. ఈ సందర్బంగా సింగరేణి కాలనీ, రాసూల్ పురా తదితర బస్తీలకు చెందిన యువతీ, యువకులకు లాప్ టాప్ లను పంపిణీ చేశారు. ఐఐటి ఖరగ్ పూర్ లో సీట్ సాధించిన రమేష్ అనే యువకుడిని డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐజి రమేష్ రెడ్డి, వివేకానంద, హేమా ప్రతాప, అరుంధతి, జనార్దన్, మనోజ్ గుప్త, ప్రకాష్ లు పాల్గొన్నారు.