దేశాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం అందించిన సహకారం గొప్పదని, దేశాన్ని ప్రపంచంలోనే 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపు దిద్దుకోవడంలో తెలంగాణ ప్రజలదే కీలకపాత్ర ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కాజీపేటలో రైల్వే మాన్యు ఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, రాష్ట్రంలో దాదాపు రూ. 6100 కోట్ల విలువైన అనేక ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గత తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, మెరుగైన అనుసంధానo పై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. దేశ చరిత్రలో ఒక స్వర్ణయుగాన్ని చూస్తున్నామని, దేశ పురోగతిలో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వేలాది ఆధునిక కోచ్లు ,లోకోమోటివ్ల ఉత్పత్తితో భారతీయ రైల్వేలు అనేక సంవత్సరాలుగా నూతన శిఖరాలకు చేరుకుంటుందని ప్రధాన మంత్రి కొనియాడారు. భారతీయ రైల్వేలు ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో భాగంగా ఇప్పుడు కాజీపేట కూడా గర్వించదగిన భాగస్వామిగా మారిందని ఆయన తెలిపారు. కాజీపేటలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ను నిర్మించడం వల్ల కొత్తగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఈ ప్రాంతంలోని అనేక కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. నెలకు దాదాపు 200 వ్యాగన్లను ఉత్పత్తి చేస్తుందని మోడీ చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్, కేంద్ర రోడ్డు రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ జైరాం గడ్కరీ, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి జి. కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ కుమార్ తో పాటు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.