ఛానల్స్ లో ఇక మరింత సాంకేతిక మార్పు రావచ్చు. ప్రత్యేకంగా అందమైన యాంకర్ల కోసం వెతకడం, వాళ్ళను ఇంటర్వ్యూలు చేసి, వడపోసి ఎంపిక చేయడం లాంటి ప్రక్రియలకు భవిష్యత్తులో తెర పడవచ్చు. తడబాట్లు , బిడియం వంటి తలనొప్పులకు తావులేకుండా బుట్ట బొమ్మల్లాంటి యాంకర్లతో కార్యక్రమాలు చేయించ వచ్చు. ఎలాంటి యాంకర్లు, న్యూస్ రీడర్లు కావాలో ఉహించుకొని అలాంటి వాళ్ళను తెరపై చూపవచ్చు. అందుబాటులోకి వస్తున్నా సాంకేతిక పరిజ్ఞానం ఈ వెసులుబాటును కల్పించనుంది. అదే ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ (ఎ.ఐ) ప్రభావం. ఇప్పటికే వివిధ రంగాల్లో దూసుకుపోతున్న ఈ పరిజ్ఞానం ఇప్పుడిప్పుడే మీడియాలో చేరనుంది. కొన్నిఛానళ్ళ యాజమాన్యాలు ఎ.ఐ విధానంలో వర్చువల్ న్యూస్ యాంకర్ ను సృష్టించి వారితో వార్తలు చదివించే ప్రయత్నాలను ప్రారంభించారు. ఒడిషా లో ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ వాళ్లు వర్చువల్ న్యూస్ యాంకర్ ను ఆవిష్కరించడం అందుకు తాజా ఉదాహరణగా చెప్పవచ్చు. భారతీయత ఉట్టిపడేలా అందంగా, అపురూపంగా, సాంప్రదాయ చేనేత చీర ధరించి “లీసా” పేరుతో మలచబడిన ఈ ఎ.ఐ. బొమ్మ చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది.