ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడి హాజరవుతున్నారు. మోడీ పర్యటనకు సంబంధించి కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా నిరబ్ మాట్లాడుతూ రేపు కేసరపల్లి ఐ.టి. పార్కు ప్రాంగణంలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో 12 ఉదయం 8.20 గంటలకు మోడి ఢిల్లీ నుండి విమానంలో బయలుదేరి ఉదయం 10.40 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారన్నారు. 10.55కి అక్కడ సమీపంలోని ఐటి పార్కు ప్రాంగణానికి చేరుకుని 11గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మోడి మధ్యాహ్నం 12.40 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని 12.45కు విమానంలో భువనేశ్వర్ వెళతారని వివ్వరించారు.

ప్రధాని పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో పాటు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.ఇందుకు సంబంధిత శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లన్నీ పటిష్టంగా చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో 12న జరిగే ముఖ్యమంత్రి, మంత్రి వర్గ సభ్యుల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లనుకుమార్ ప్రసాద్ అధికారులతో సమీక్షించారు. ఈసమావేశంలో అదనపు డిజిపి ఎస్.బాగ్చి, జిఏడి కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్, డైరీ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఎం.డి. బాబు, చీఫ్ కమీషనర్ స్టేట్ ట్యాక్సెస్ గిరిజా శంకర్ పాల్గొన్నారు. అదేవిధంగా స్పెషల్ సి.ఎస్. కె.విజయానంద్, సిఆర్డిఏ కమీషనర్ వివేక్ యాదవ్, ఎన్టిఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, విజయవాడ పోలీస్ కమీషనర్ రామకృష్ణ , డైరెక్టర్ ఫైర్ సర్వీసెస్ మురళి తదితర అధికారులు వర్చువల్ గా పాల్గొన్నారు.