1969లో మూగబోయిన తెలంగాణ నినాదానికి తిరిగి జీవం పోసింది ఈ గులాబీ జెండానే అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్తు చేశారు. వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ప్రజలు పరిపాలన అప్పగిస్తే విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించా అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశ్రయమిస్తే ఏప్రిల్ 27, 2001న జల దృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావం తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన మహోజ్వల ఘట్టం. కులం, మతం, పదవుల కోసం పుట్టలేదన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టింది టీఆర్ఎస్ పార్టీ. పదవీ త్యాగాల తోనే మన తెలంగాణ ప్రస్థానం ప్రారంభమైంది. అది ఫలించి సొంత రాష్ట్ర కల కూడా నెరవేరింది. చీకట్లను పారదోలడానికి ప్రజల్లో ఆత్మ విశ్వాసం పెంపొందించడానికి ఒక మాట చెప్పాను. ఉద్యమం నుంచి వెనక్కి మళ్లితే, ఉద్యమ జెండాను దించితే రాళ్లతో కొట్టి చంపాండని అని చెప్పి ఉద్యమాన్ని ప్రారంభించినట్టు గుర్తు చేశారు. ఆ తనదనంతరం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో, సిద్ధిపేట ఉప ఎన్నికల్లో ప్రజలు ప్రాణం పోసి ఊపిరిలూదితే అద్భుతంగా ఉద్యమం పురోగమించింది. 60 ఏండ్ల సమైక్య పాలనలో ఎంతో వేదన, హింస, అణిచివేత చూశాం. అందరికీ బాగా తెలుసు, గోదావరి, కృష్ణా నీళ్లు దక్కకకుండా తరలి పోతే తల్లి చనుబాలకు నోచని పిల్లలాగా తెలంగాణ బిడ్డలు రోదించారు. కురువు, కాటకాలకు గురయ్యారు. పాములు, తేళ్లు కుట్టి అనాథాల్లాగా చనిపోయారు అని కేసీఆర్ చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా జెండా దించలేదని అన్నారు. చీకట్లను పారద్రోలి తెలంగాణలో వెలుగులు తీసుకొచ్చామని తెలిపారు. వలసవాదుల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించామన్నారు. అధికారంలోకి వచ్చాక విధ్వంసమై తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించామని చెప్పారు. అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించుకున్నామన్నారు. మూడేళ్లలో కాళ్లేశ్వరం కట్టాం, పంజాబ్ను తలదన్నేలా పంటలు పండించాం, దళితబంధు, రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబీమా వంటి అనేక చారిత్రాత్మక పథకాలు తీసుకొచ్చి అన్ని వర్గాల ప్రజల రూపురేఖలు మార్చుకున్నామని కెసిఆర్ అన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు ఎంతో గోసపడ్డారని తెలిపారు. ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా తెలంగాణకు శత్రువు కాంగ్రెస్ పార్టీనే అన్నారు.