"గులాబీ" గరళం... - EAGLE NEWS

“గులాబీ” గరళం…

IMG 20250427 WA0025 scaled

భారాస అధినేత కేసీఆర్‌ మనసంతా విషంతో నిండిపోయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆయన ప్రసంగం మొత్తంలో కాంగ్రెస్‌ను విలన్‌లా చిత్రీకరించడం తప్ప ఇంకేమీ లేదని విమర్శించారు. మంచి సలహాలు, సూచనలు ఇస్తారేమోనని కేసీఆర్‌ ప్రసంగం విన్నామని, అందులో ఏమీ లేదని ఎద్దేవా చేశారు. భారాస రజతోత్సవాల సందర్భంగా ఎల్కతుర్తిలో కేసీఆర్‌ చేసిన ప్రసంగంపై పొంగులేటి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ తీరును తప్పుబట్టారు.‘‘గత సీఎం పరిపాలన వల్ల ధనిక రాష్ట్రం అప్పులపాలైంది. అప్పులున్నా.. ప్రజలకు సంక్షేమం అందిస్తున్నాం. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ను విలన్‌గా చిత్రీకరిస్తున్నారా? కడుపంతా విషం నింపుకొని కేసీఆర్ మాట్లాడటం బాధ కలిగించింది. రెండుసార్లు భారాసకు అధికారం ఇస్తే ఎలా కొల్లగొట్టారో ప్రజలు గమనించారు. కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చి.. మంచి సలహాలు ఇస్తారని ఎదురుచూశాం. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఐదారు పర్యాయాలు అసెంబ్లీ జరిగింది.

కేవలం రెండుసార్లే కేసీఆర్‌ వచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు సచివాలయానికి కూడా కేసీఆర్‌ వెళ్లలేదు.కేసీఆర్‌ దొర మాదిరిగా పరిపాలిస్తే మా ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రజలకు కాంగ్రెస్‌ అందిస్తున్న మంచి పాలన గురించి తట్టుకోలేక కేసీఆర్‌ విషం కక్కారు. గతంలో వరి వేస్తే ఉరి అని చెప్పి.. కేసీఆర్‌ మాత్రం 150 ఎకరాల్లో వరి వేశారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కేసీఆర్‌ మాట్లాడుతున్నారు. గత భారాస ప్రభుత్వం కాంట్రాక్టర్లకు రూ.82 వేల కోట్లు బకాయిలు పెట్టింది. సర్పంచులకు కాంగ్రెస్‌ బకాయిలు పెట్టిందని కేసీఆర్‌ అంటున్నారు. మా ప్రభుత్వం వచ్చాక సర్పంచులే లేరు. మా ప్రభుత్వంలో సర్పంచులు ఒక్క రూపాయి పని కూడా చేయలేదు. అధికారంలోకి రావాలని కేసీఆర్‌ పగటికలలు కంటున్నారు. భారాస సభకు ఆటంకాలు సృష్టించామని కేసీఆర్‌ ఆరోపించారు. సభకు అసలు ఆటంకం సృష్టించలేదు.. మేం ఇబ్బంది పెట్టి ఉంటే సభ జరిగేదా? ఆ పార్టీ నేతలు అడిగినన్ని బస్సులను సభకు పంపాం. గత సీఎం పరిపాలన వల్ల ధనిక రాష్ట్రం అప్పులపాలైంది’’ అని శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *