

రాష్ట్రంలోని పలు అభివృద్ధి పథకాలకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరుతూ న్యూ ఢిల్లీలోని పలువురు కేంద్ర కార్యదర్శులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలసి విజ్ఞప్తి చేశారు. ఒక రోజు పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన సి.ఎస్, కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ , కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి లీలా నందన్, కేంద్ర రహదారులు, రవాణా, జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పలు పెండింగ్ ప్రాజెక్ట్ లకు సంబంధించి అనుమతులను జారీ చేయాలని సి.ఎస్ కోరారు. ప్రధానంగా, ప్యారడైస్ జంక్షన్ నుండి కండ్ల కోయా ఓ.ఆర్.ఆర్ వరకు, ప్యారడైజ్ నుండి కరీంనగర్, రామగుండం మార్గంలోని ఓ.ఆర్.ఆర్ వరకు నిర్మించ తలపెట్టిన రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి, అదే విధంగా మెహదీపట్నం జంక్షన్ లో ప్రతిపాదిత స్కై- వాక్ నిర్మాణ పనులకు అవసరమైన మొత్తం 150.39 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయింపు చేయాలని సి.ఎస్ శాంతి కుమారి కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ ను కోరారు. రక్షణ శాఖ భూములకు సరిపడా ప్రత్యామ్నాయ భూములను కూడా అందిస్తామని ఈ సందర్బంగా స్పష్టం చేశారు. సి.ఎస్ శాంతి కుమారి చేసిన విజ్ఞప్తులపై కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి స్పందిస్తూ, ఈ విషయంలో సంబంధిత వివరాలను తెప్పించుకొని త్వరలోనే తగు నిర్ణయం తీసుకోగలమని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సి.ఎస్ శాంతి కుమారి తోపాటు, రాష్ట్ర ప్రభుత్వ రవాణా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, తెలంగాణా భవన్ రెసిడెంట్ కమీషనర్ గౌరవ్ ఉప్పల్ లు పాల్గొన్నారు.
