"రామోజీ" కన్నుమూత .. - EAGLE NEWS

“రామోజీ” కన్నుమూత ..

ramoji cf

“ఈనాడు” గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు(88) కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్ సిటీలోని నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలించనున్నారు.

eenadu first
“ఈనాడు” తొలి సంచిక

1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. “ఈనాడు” దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ‘ఈనాడు’ను ప్రారంభించారు. నాలుగేళలోనే పాఠకుల నుంచి విశేష ఆధరణ చూరగొంది. ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా సితార సినీ పత్రిక నిలిచింది. బహుముఖ ప్రజ్ఞ, కఠోర సాధనలే రామోజీ అస్త్రాలు. కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. లక్ష్య సాధన కోసం దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు. రైతుబిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు. ఉషాకిరణ్ మూవీస్ ద్వారా అనేక సందేశాత్మక సినిమాలు నిర్మించారు. అనేక మంది కొత్త నటులకు వేదిక ఇచ్చారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చిత్ర పరిశ్రమ కోసం నిర్మించిన “ఫిల్మ్ సిటీ” ఆయన కలల సౌధం. అక్కడే ఆయన తన స్మారకాన్ని సైతం ఏర్పాటు చేయించుకున్నారు.

ramoji venkaya
వెంకయ్యనాయుడు

ఆయన మృతికి రాష్టపతి ముర్మ్ , ప్రధాని నరేంద్ర మోడీ సహా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, వెంకయ్య నాయుడు, చిరంజీవి,బాలకృష్ణ, మహేష్ బాబు, పలువురు నేతలు కళారంగ నిపుణులు సంతాపం తెలిపారు. పత్రికా రంగానికే కాక పారిశ్రామిక, కళా రంగాలకు రామోజీ అందించిన సేవలను కొనియాడారు. మీడియా, జర్నలిజం ప్రపంచానికి ఆయన చేసిన విశేష కృషికి గాను 2016లో ఆయనకు భారత దేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారం కూడా లభించింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పద్మ విభూషణ్‌తో సత్కరించారు.

ramoj babu
చంద్రబాబు నివాళి

పత్రిక నుంచి వచ్చిన ఆదరణ తర్వాత రామోజీ సినిమా నిర్మాణం వైపు మళ్లారు. 1983లో ఉషాకిరణ్‌ మూవీస్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ని స్థాపించారు. దీని ఆధ్వర్యంలో అనేక తెలుగు చిత్రాలను నిర్మించారు. ఈ బ్యానర్‌లో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ సహా 80కి పైగా విభిన్న భాషల్లో సినిమాలు నిర్మించారు. 1985లో ఫిల్మ్‌ ఫేర్ ఉత్తమ చలన చిత్ర పురస్కారం (తెలుగు), 1998లో ఫిల్మ్‌ ఫేర్ ప్రత్యేక అవార్డు, 2000లో ఫిల్మ్‌ ఫేర్ ఉత్తమ చలన చిత్ర పురస్కారం (తెలుగు), జాతీయ చలన చిత్ర పురస్కారం (నిర్మాత), 2004లో ఫిల్మ్‌ ఫేర్ లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు లభించాయి.

ramoji pawan
పవన్ కళ్యాణ్

దేశంలో ప్రాంతీయ ఛానెల్‌ లను ప్రారంభించిన మొదటి వ్యక్తి రామోజీ. నేడు దేశం లోని దాదాపు ప్రతి రాష్ట్రంలో వార్తలను ప్రసారం చేస్తున్నారు. ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్ మొబైల్ అప్లికేషన్ సహా తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ఈటీవీ మంచి నెట్‌ వర్క్‌ను కల్గి ఉంది. దీంతో పాటు జర్నలిజం స్కూల్ కేంద్రాన్ని నిర్వహిస్తూ ప్రత్యేక స్థానాన్ని రామోజీ సంపాదించుకున్నారు.

ramoji lokesh
లోకేష్ దంపతులు..

రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచం లోనే అతి పెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్‌గా చెప్పవచ్చు . ఇది హైదరాబాద్‌ కు 25 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ స్టూడియో రెండు వేల ఎకరాల కంటే ఎక్కువ ( సుమారు 8.2 చదరపు కిలో మీటర్లు) విస్తీర్ణంలో ఉంది. స్టూడియోలో దాదాపు 50 షూటింగ్ అంతస్తులు ఉన్నాయి. ఈ స్టూడియో 1996లో ప్రారంభమైంది. ఇక్కడ ఏక కాలంలో 15 నుంచి 25 చిత్రాలను చిత్రీకరించే వీలుంది. సినిమా ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *