రగులుతోంది….

పారిస్‌ నగరం అల్లర్లతో అట్టుడుకుతోంది. పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడు మృతి చెందడంతో  నాలుగు రోజుల కిందట ఫ్రాన్స్ లో ఒక్కసారిగా నిరసన జ్వాలలు  భగ్గుమన్నాయి. పారిస్‌ శివారులోని నాంటెర్రెలోని ట్రాఫిక్‌ స్టాప్‌ వద్ద  నహెల్‌ అనే యువకుడిని పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటనతో రెండు రోజులుగా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. ముఖ్యంగా పారిస్‌ నగరంలోని స్కూళ్లు, టౌన్‌హాళ్లు, పోలీస్‌ స్టేషన్లు వంటి పలు ప్రభుత్వ భవంతులు, వాహనాలు, ఇతర ఆస్తులకు నిప్పంటించారు. రాళ్లు రువ్వారు. వీటిని నిలువరించేందుకు పోలీసులు పలుమార్లు బాష్పగోళాలు ప్రయోగించారు. దాడుల్లో వందకు పైగా ప్రభుత్వ భవనాలు దెబ్బతిన్నట్లు అంచనా వేసింది. ఒక్క పారిస్‌ ప్రాంతంలోనే 40వేల మంది పోలీసులను మోహరించారు. ఆందోళనకారుల దాడుల్లో 170 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సు, రైలు సర్వీసులను నిలిపివేసింది. ఫలితంగా రాజధాని, శివారు ప్రాంతాలకు చెందిన వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దాడులు ఎక్కువగా జరిగిన ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించింది. పలు భవనాలు, వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఆందోళనల్లో పాల్గొన్న వారిలో యువతే ఎక్కువగా ఉన్నారు. దీంతో పారిస్‌ శివారులోని క్లామర్ట్‌ పట్టణంలో కర్ఫ్యూ విధించారు. మరోవైపు యువకుడిపై కాల్పులు జరిపిన పోలీసు అధికారి ప్రాసిక్యూషన్‌ ప్రారంభమైంది. పిల్లలను బయటకు పంపొద్దని ఆ దేశ అధ్యక్షులు ఇమన్యుల్ మక్రోన్ హెచ్చరించారు. నగరంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి మరిన్ని సాయుధ బలగాలను రంగంలోకి దించుతున్నట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *