రాజ్యాంగం లోని ఆర్టికల్ 19 ని ఆధారం చేసుకొని నీతు చెప్పడం కాదు, ప్రజా వేదికలపై మాట్లాడే సమయంలో ఎలా ప్రవర్తించాలనేది కూడా ముఖ్యం. వ్యక్తిగత ప్రయోజనాలకంటే, ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలి. నైతిక బాధ్యత అంటే అదీ. హక్కుల విలువ ఇవ్వడం అంటే అదీ. అంతేగానీ, నేను ఏది మాట్లాడినా చెల్లుబాటు కావాలి, ఎదుటి వాడు ఏది చెప్పినా అదీ మనకు అనుకూలంగా ఉండాలనే ఆలోచన పరమ దుర్మార్గం. ప్రజా ప్రతినిధిగా ఎన్నికై, బాధ్యత గల హోదాలో ఉన్న వారు ప్రతి అంశాన్ని ఆలోచించాలి, ఎదుటి వారి పై చర్యలు తీసుకునే ముందు ఆచితూచి వ్యవహరించాలి. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ తన మనోభావం దెబ్బతిన్నదని అధికారాన్ని దుర్వినియోగం చేయడం కచ్చితంగా అహంకారమే అవుతుంది. “పలుకుబడి”ని ఉపయోగించి పగ తీర్చుకావాలని ప్రయత్నించడం మహా నేరం. రాజ్యాంగంలోని హక్కుల గురించి మీడియాకు నీతులు వల్లిస్తూనే, సామాజిక మాధ్యమ నిర్వాహకులను బెదిరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ధోరణి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఆయన ఏ తప్పూ చేయనట్టు ఆర్టికల్ 19 గురించి ప్రస్తావించడాన్ని రాజకీయ, సామాజిక విశ్లేషకులు లోతుగా పరిశిస్తున్నారు. ఇదే సందర్భంలో ఆయన గతంలో వ్యవహరించిన తీరు తెన్నులను మరోసారి సమీక్షిస్తున్నారు.

నీతులు సరే.. ఈ చేష్టలు ఏంటి..!
ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో తనకు నచ్చని విధంగా రాస్తున్నారనే సాకుతో ఆంధ్రా పోలీసులు కిడ్నాప్ గ్యాంగ్ అవతారమెత్తి హైదరాబాద్ జర్నలిస్టును టెర్రరిస్టు మాదిరిగా రాత్రికి రాత్రి అరెస్టు చేయడం ఏ నీతి అనేది పవన్ చెప్పాల్సి ఉంది. ఏదైనా ప్రసార సాధనంలో నచ్చని, తప్పుడు కథనం వస్తే అది వాస్తవం కాదు అని చెప్పడానికి మార్గాలు ఉంటాయి. ఖండన ఇవ్వవచ్చు, సమావేశం ఏర్పాటు చేసి అదే విషయాన్ని వివరంగా విలేకర్లకు చెప్పవచ్చు. ఇదీ అసలు పద్ధతి. దీన్ని పట్టించుకోకుండా అధికారం ఉన్నదికదా అని పోలీసులను పంపి దౌర్జన్యంగా ఎత్తుకు వెళ్ళడం పవన్ రాజ్యాంగానికే చెల్లుబాటు అవుతుందేమో. పైగా, తనకే తెలిసినట్టు విలేకరులకు, మీడియాకు కొత్తగా ఆర్టికల్ 19, దాని ప్రాధముఖ్యతను వివరిస్తూ ఒక సొల్లు సమాచారాన్ని పోస్టు చేయడం హాస్యాస్పదంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
గతంలో ఇదే పవన్ కల్యాణ్ రాజకీయ నేతలను “పంచలు ఊడదీస్తాం” అంటూ ఆవేశపూరిత వ్యాఖ్య చేసినప్పుడు ఆర్టికల్ 19 గుర్తుకు రాలేదా అనే వాదనలు తెరపైకి వస్తున్నాయి.అప్పట్లో ఈ అనాలోచిత మాటలు నాయకుల మనోభావాలను దెబ్బతీసి, వివాదమైన సంగతి తెలియదా. అంతేకాదు, చిరంజీవి కూతురు ప్రేమ వ్యవహారంపై వార్త ప్రచురించిన సికింద్రాబాద్ లోని ఒక దినపత్రిక యాజమాన్యం అంతం చూస్తా అంటూ జనం మధ్య నడిరోడ్డుపై తుపాకీ పట్టుకొని పవన్ చేసిన హంగామా గుర్తు చేసుకుంటున్నారు. శ్రీజా కొణిదెల మొదటి భర్త శిరీష్ కి ప్రాణహాని ఉందంటూ సాక్షాత్తు శ్రీజ ఆందోళన వ్యక్తం చేస్తే తన రివాల్వర్ ను నేరుగా పోలీసు స్టేషన్ లో అందజేయాల్సింది పోయి దాన్ని సినిమా ఫక్కీలో మీడియా ముందు ప్రదర్శించినప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ, శాంతి భద్రతల చట్టాలు ఎక్కడికి వదిలేశారు అనే వాదనలు మొదలయ్యాయి. సినిమా వేషాలను రోడ్లపై చూపించమని ఏ రాజ్యాంగ చెప్పిందో పవన్ కి తెలియదా అనే ఘాటైన విమర్శలు వస్తున్నాయి.
ఇక నెల రోజుల కిందట తెలంగాణ గడ్డపై మాట్లాడుతూ “తెలంగాణ మీ అయ్యా జాగీరా” అంటూ చేసిన వ్యాఖ్య నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డల మనోభావాలను దెబ్బతీసినట్టు కదా అనే ప్రశ్నలు గుప్పుమంటున్నాయి.మాట్లాడే హక్కుకు కొన్ని పరిమితులు ఉంటాయి. అంతేగానీ, ఆ హక్కు ఉందికదా అని ఆవేశపూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. ఆయన జూన్ 2న మాట్లాడిన విధానం ఇదే విధంగా ఉండడం గమనార్హం.

సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, నకిలీ ఖాతాలపై చర్యలు తీసుకుంటామని, ఐటీ చట్టం, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) వంటి చట్టాల కింద కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని సామాజిక పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఆయన ఫోటో పెట్టి ఇతరులను కించపరుస్తున్న ఖాతాలు పవన్ కి కనిపించడం లేదా అంటున్నారు. పవన్ పోస్ట్ చూస్తుంటే ఆర్టికల్ 19ను వివరించే ప్రయత్నం చేస్తూ మీడియాను హెచ్చరిస్తున్నట్టు, భయపెడుతున్నట్టు ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
