
రానున్న రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు.మరో 48 గంటలలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై పోలీస్ కమీషనర్లు, ఎస్.పి.లతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ సంజయ్ కుమార్ జైన్ కూడా పాల్గొన్న ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అంజనీ కుమార్ మాట్లాడుతూ పోలీస్ యంత్రాంగం 24గంటలు అందుబాటులో ఉంటారని సహాయం కోసం డయల్ 100కి లేదా స్థానిక పోలీసు పోలీసులకు సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు. దాదాపుగా 8 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, రెడ్ అలర్ట్ ప్రకటించారని, అలాగే ఈశాన్య, తూర్పు తెలంగాణతో పాటు పశ్చిమ తెలంగాణలోని జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ఉందని తెలిపారు. హైదరాబాద్లో ఈ రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పలు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయని, ఈ జలాశయాల వద్దకు ఎవరు వెళ్లకుండా తగు ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. వరద ఉధృతితో తెగిపోయిన రోడ్లు, ఉదృతంగా ప్రవహించే కాజ్ వే ల వద్దకు ప్రజలు వెళ్లకుండా, రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్,బారిగేడ్స్, హెచ్చరిక గల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని ఆదేశించారు భద్రర్ది కొత్తగూడెం జిల్లాలో చర్ల లోని లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఉపయోగించుకోవాలని అన్నారు. రైతులు పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలి,వర్షాలు పడేటప్పుడు విద్యుత్ స్తంభాలను గాని,వైర్లను గానీ చేతులతో తాకకుండా, ఇతర జాగ్రత చర్యలపై సమాచార మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్య పర్చాలని ఆదేశించారు. వర్షాలకు కల్వర్టు, చిన్న చిన్న బ్రిడ్జి ల వద్ద నీరు ప్రవహిస్తున్నప్పుడు వాహనాలతో దాటడానికి సాహసం చేయరాదు అని సూచించారు.
