కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.హైదరాబాద్, విజయవాడ 65 వ నెంబర్ జాతీయ రహదారిపై వరద ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. కృష్ణా జిల్లా కీసర టోల్ గేటు సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతి అధికం కావడంతో ఆ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. హైద్రాబాద్ నుంచి ఏపి వెళ్ళే వాహనాలను కోదాడ,హుజూర్ నగర్,మిర్యాలగూడ మీదుగా మళ్లించారు. కోదాడ – హుజూర్ నగర్ రహదారిపై 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో హైదరాబాద్-విజయవాడ మార్గంలో రెగ్యులర్ సర్వీసులను రద్దు చేసినట్టు టీఎస్ ఆర్టీసీ ఎం.డీ., సజ్జనార్, తెలుపారు. దీనికి ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు బస్సులను నడుపుతున్నట్టు చెప్పారు. ఈ మార్గంలో ప్రతి అర గంటకో బస్సు హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ నుంచి బయలుదేరుతుందని, ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించు కోవనని కోరారు.
ఇదిలా ఉండగా,బోధన్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. నీటి ప్రవాహం అధికమైంది. ఎగువ నుంచి వరద నీరు భారీ ఎత్తున వస్తుంది. పాత వంతెనపై నుంచి వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో అధికార యంత్రాంగం తెలంగాణ మహారాష్ట్రకు రాకపోకలను నిలిపివేశారు. ఎట్టి పరిస్థితిల్లోనూ మంజీరా ప్రాంతం నుంచి ప్రయాణం సాగించవద్దని హెచ్చరికలు జారీ చేశారు. మంజీరా పరివాహక ప్రాంతాలలోని లోతంట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
ఏజన్స్ పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున, జాలరులు, చేపల వేట చేసే వారు గోదావరి, నిండు గా ప్రవహిస్తున్న వాగు, కుంటలు, చెరువు లలోకి చేపల వేటకు వెళ్లవద్దని కోరుచున్నాము. లో లెవల్ చప్టా ల వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉంటే ప్రజలు ద్విచక్ర వాహనాల ద్వారా గాని నడుచుకుంటూ దాటే ప్రయత్నం చేయవద్దని పోలీసు అధికారులు హెచ్చరించారు.అదేవిధంగా గోదావరి బేసిన్ ఎగువ పరీవాహక పప్రాంతం లోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల పరిసర ప్రాంతాలలో వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని, గ్రామాలలో వరద నీరు పెరిగితే లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉంటున్న ప్రజలు పోలీసు సిబ్బంది కి సహకరించి దగ్గరలోని పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కోరారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వరదలో కొట్టుకుపోయి కరెంటు తీగలకు తగిలి వేలడబడ్డ యాచకుడి మృతి దేహం దయనీయంగా ఉంది. స్థానిక అధికారులు సిబ్భంది సహకారంతో బయటకు తీశారు. నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావు పల్లి నల్ల వాగు మత్తడిలో గల్లంతైన పిట్లం వాసి జంగం కృష్ణ మృతదేహం లభ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు . అదుపుతప్పిన ప్రాంతం నుండి కొంత దూరంలో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కలిసి గాలింపు చర్యలు చేపట్టగా ఒక చెట్టు కొమ్మకు చిక్కుకొని మృతదేహం లభ్యమైనట్టు వివరించారు.