మేడారం జాతరలో వైద్య, ఆరోగ్య పరంగా పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. మేడారం జాతర ఏర్పాట్లు, ఆరోగ్య పరిరక్షణ పై తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆయుష్, ఫుడ్ సేఫ్టీ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల నుండే భక్తులు లక్షలాదిగా రానున్నట్టు మంత్రి తెలిపారు.
ఇప్పటి నుండే ప్రధాన ప్రాంతాలలో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని సూచించారు. మందులు, పరీక్ష పరికరాలు, నోటీసు బోర్డులు తదితర ఏర్పాట్లను చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. వచ్చే నెలలో నెల 15వ తేదీ నుండి ప్రధాన జాతర తేదీలైన ఫిబ్రవరి 21 నుండి 24 వరకు పూర్తిస్థాయిలో 3 షిఫ్ట్ లలో మెడికల్ క్యాంపులను, సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆహార భద్రత అధికారులు పలు టీములుగా పనిచేస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు మాట్లాడుతూ పలు ప్రాంతాలలో 90 వరకు వివిధ రకాల మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు . ప్రధాన జాతర సందర్భాలలో 3 షిఫ్టులుగా నిర్వహిస్తున్నామన్నారు. మాస్కులను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామ న్నారు .ఈ సమీక్ష లో వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ ఆర్. వి. కణ్ణన్, ఆయుష్ డైరెక్టర్ ప్రశాంతి, ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ శివలీల, గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, డిఎంఈ డాక్టర్ త్రివేణి, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ రవీంద్ర నాయక్, విద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.