భారత రాష్ట్ర సమితి అధినేత, శాసన సభ్యులు చంద్రశేఖర్ రావు ఎట్టకేలకు సభలో అడుగు పెట్టారు. గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత అనారోగ్యానికి గురైన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సభలకు దూరంగా ఉన్నారు. గత సమావేశాల సమయంలో కోలుకున్నప్పటికీ ఆయన అసెంబ్లీకి రాలేదు. కరెంటు, కాళేశ్వరం, ఇంటిలిజెన్స్ వ్యవహారం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగినా కేసీఆర్ స్పందించలేదు. కానీ, ప్రస్తుత బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నేతగా తప్పనిసరి రావలసిన పరిస్థితి ఏర్పడింది. గులాబీ నేతలు సైతం సభకు రావలసిన ఆవశ్యకత పై కేసీఆర్ కి వివరించినట్టు సమాచారం.
అంతేకాదు, ఎన్నికల్లో ఓడిపోయిన రోజు ప్రగతి భవన్ నుంచి నేరుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోయిన కేసీఆర్, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం పై అటు రాజకీయంగానూ, ఇటు ప్రజల నుంచి కూడా విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. అధికారం కోల్పోయిన అంత మాత్రాన సభకు వెళ్ళక పోవడం ఏలాంటి రాజనీతి అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని తప్పని పరిస్థితిలో సభకు రావాలని కేసీఆర్ మొన్న జరిగిన భారాస ఎమ్మెల్యేల సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. కానీ, మొదటి రెండురోజులు ఆయన సభకు దూరంగానే ఉన్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టే రోజున పార్టీ ఎమ్మెల్యేలతో పాటు శాసన సభకు వచ్చారు. రాష్ట్రంలో పరిస్థితులను చూసి అగ్నిపర్వతం మాదిరిగా ఉన్నానని మొన్న ఆయన దళంతో అన్న మాటలను బట్టి సభలో తన గళాన్ని ఏ మేరకు వినిపిస్తారో చూడాలి.