ఏజెన్సీ ప్రాంతాలలో నివాసం ఉంటున్న బీసీ వర్గాలలోని సంచార, అర్థ సంచార, విముక్త కులాలు, జాతుల ప్రజలను ప్రత్యేకంగా గుర్తించి వారి జీవన ప్రమాణాల మెరుగు పరిచేందుకు ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని సినీ నటుడు సుమన్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర బీసీ కమిషన్ ను కోరింది. కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, సభ్యులు, సి.హెచ్.ఉపేంద్ర, కె. కిశోర్ గౌడ్ లతో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలను కమిషన్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు బీసీ వర్గాలకు ఎంతగానో చేయూతను అందిస్తున్నాయని కితాబు ఇచ్చారు. కొన్ని ప్రాంతాలలో ఓటర్ కార్డు, ఆధార్ కార్డు లాంటి ప్రయోజనాలను కూడా స్థిర నివాసులుగా లేని కారణంగా పొందలేక పోతున్నారని కమిషన్ కు తెలిపారు. ప్రధానంగా రాష్ట్ర బీసీ జాబితాలోని ఎ-గ్రూప్ లో గల సంచార, విముక్త కులాల నిమిత్తం ప్రత్యేక అధ్యయనం నిర్వహించి, వారి జీవితాలలో ప్రభుత్వం వెలుగులు నింపే దిశగా రాష్ట్ర బీసీ కమిషన్ సిఫారసులు ఉండాలని ఆయన కోరారు.