ప్రాణ ప్రతిష్ఠకు ముందే బాల రాముడి దివ్య రూపం భక్తులకు దర్శనమిస్తోంది. బాల రాముడి చేతిలో బంగారు వర్ణంలో ఉన్న విల్లు, బాణం ఉంది. బాల రాముడి విగ్రహం తయారీ తర్వాత కార్యశాలలో తీసిన ఫోటో బయటకు వచ్చింది. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆ ఫోటోపై స్పందించింది. అదే బాల రాముడి దివ్య రూపం అని తెలిపింది.
శుక్రవారం ఉదయం కళ్లకు గంతలతో ఉన్న బాల రాముడి విగ్రహం ఫోటో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. నల్లటి (కృష్ణ శిల) పద్మ పీఠంపై బాల రాముడు దర్శనిమచ్చాడు. ఈ రామ్ లల్లా విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి రూపొందించిన విషయం తెలిసిందే.అయోధ్యలో ఈ నెల 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ క్రతువుల్లో భాగంగా గురువారం కీలక ఘట్టం ఆవిష్కృతమైన విషయం తెలిసిందే.అయోధ్య రామాలయ గర్భగుడి లోకి రామ్ లల్లా విగ్రహాన్ని చేర్చారు. 51 అంగుళాల ఈ విగ్రహం బుధవారం రాత్రి అయోధ్యకు చేరగా, క్రేన్ సహయంతో దానికి ఆలయ ప్రాంగణానికి చేర్చారు.అక్కడి నుంచి గురువారం ఉదయం జై శ్రీరామ్ నినాదాలు, పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య క్రేన్ సహాయంతో విగ్రహాన్ని గర్భగుడి లోకి తీసుకొచ్చారు. అనంతరం బాల రామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాస్తవానికి గర్భాలయంలో ప్రాణ ప్రతిష్ట కోసం మూడు విగ్రహాలను ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు సిద్ధం చేయించారు. వాటిల్లో కర్ణాటక కు చెందిన శిల్ప కళాకారుడు అరుణ్ యోగిరాజ్ చెక్కిన శిల్పం గర్భ గుడిలో కొలువు దీరనుంది. ఈ విగ్రహాన్ని కోట్లాది మంది భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించనున్నారు. 22 న ప్రాణ ప్రతిష్ట జరుపుకోనున్న ఈ బాల రామయ్య రూపాన్ని తొలిసారిగా ప్రపంచానికి చూపించారు.