ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ – ఐఐటీ హైదరాబాద్ ఐఐటీ సహమాకారంతో మైనింగ్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సమాకారం అందిస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ రోజు డాక్టర్ బీఆర్ ఆంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో భట్టి విక్రమార్కతో ఐఐటీ హైదరాబాద్ కు చెందిన ప్రొఫెసర్ మూర్తి, ఆస్ట్రేలియా మెల్ బోర్న్ లో మోనాష్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎలిశెట్టి మోహన్ లు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా బ్యాటరీలలో వినియోగించే లిథియం వంటి క్రిటికల్ మినరల్స్ ఉత్పాదన భారత్ లో ఆశించిన మేరకు జరగడం లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆత్మనిర్భర్ భారత్ కింద కూడా క్రిటికల్ మినరల్స్ ఉత్పాదన అనుకున్నంత స్థాయిలో లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఇరువురు ప్రొఫెసర్లు వివరించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రిటికల్ మినరల్స్ ఉత్పాదనకు పథకాలు అమలు చేస్తే.. దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. క్రిటికల్ మినరల్స్ కు సంబంధించి హైదరాబాద్ ఐఐటీ – ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ యూనివర్సిటీ భాగస్వాములుగా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రికి వారు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఈ క్రిటికల్ మినరల్స్ లో కలిసి ముందుకు వెళ్లాలని వారు కోరారు. అంతేకాక సింగరేణిలోని ఓపెన్ కాస్ట్, అండర్ కాస్ట్ బావుల వద్ద విద్యుత్ ను నిలువ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. ఇందుకు సింగరేణి నుంచి పూర్తి సహాకారం కావాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన పంపులను ఉపయోగించి పగటి పూట విద్యుత్ వినియోగం అధికంగా ఉన్న సమయాల్లో రివర్స్ పంపింగ్ ద్వారా విద్యుత్ ఉత్పాదన చేయవచ్చని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారత తగ్గుతుందని వివరించారు. ఇదిలా ఉండగా కొత్తగా ఏర్పాటుకానున్న స్కిల్ యూనివర్సిటీతో ఐఐటీ హైదరాబాద్ భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి చూపుతోందని ఉప ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ మూర్తి చెప్పారు. మోనాష్ యూనివర్సిటీ-ఐఐటీ హైదరాబాద్ ఐఐటీ సహమాకారంతో మైనింగ్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలని వారు కోరారు. సమావేశంలో వారు చెప్పిన పలు అంశాలకు ఉప ముఖ్యమంత్రి స్పందిస్తూ రాష్ట్రానికి మేలు చేసే ఏ అంశానికైనా ప్రభుత్వం తన మద్దతును ఇస్తుందని చెప్పారు.
