విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో సంభవించిన అగ్ని ప్రమాదంలో మత్యకారులకు చెందిన సుమారు 40 బోట్లు కాలి బూడిద అయ్యాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన హార్బర్ కు చేరుకొని మంటలు అదుపు చేసారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధిండిన కారణాలు తెలియలేదు. మత్స్యకారుల బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని ఆదేశించారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనాస్థలానికి వెళ్లాలని ఆదేశించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, తగిన విధంగా వారికి సహాయం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
కోట్లాదిరూపాయల మత్స్యసంపద అగ్నికి ఆహుతికి కావడం బాధ కలిగించిందని టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు.అత్యంత సున్నితమైన షిప్ యార్డు ప్రాంతంలో భద్రతా చర్యల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దారుణమని, ఈ ప్రమాదంలో నష్టపోయిన వారంతా రెక్కాడితే గానీ డొక్కాడని పేద మత్స్యకారులైనందున ప్రభుత్వం పెద్దమనసుతో స్పందించి వారికి కొత్తబోట్లు, మెరుగైన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.
