ఇక మంచి రోజులే…

IMG 20231007 WA0022 1

భారత దేశంలో మహిళా రిజర్వేషన్ల చట్టం వల్ల భవిష్యత్తులో మహిళలకు మంచి రోజులు వస్తాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. చట్టసభల్లోకి మరింత మంది మహిళలు ప్రవేశించడానికి మార్గం చూపే విప్లవాత్మక బిల్లును భారత్ ఆమోదించిందని చెప్పారు. ప్రస్తుతం భారత పార్లమెంటులో 78 మంది మహిళా ఎంపీలుగా ఉన్నారని, మహిళా రిజర్వేషన్లతో ఆ సంఖ్య 181కు చేరుతుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటుకు తీసుకు రావడంలో 1996లో దేవే గౌడ ప్రభుత్వం, 2010లో సోనియా గాంధీ, 2023లో ప్రధాని నరేంద్ర మోడీ కీలకంగా వ్యవహరించారని, వారికి ధన్యవాదాలు తెలిపారు.

IMG 20231007 WA0021

లండన్ లోని పబ్లిక్ పాలసీకి సంబంధించిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్ ఇండియా “మహిళా రిజర్వేషన్లు ‌ – ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం’’ అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో కవిత మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కేసీఅర్ మహిళా బిల్లును పార్లమెంటు ఆమోదించాలని తీర్మానం చేయించి కేంద్రానికి పంపించారని గుర్తు చేశారు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తారని, ప్రధాన మంత్రికి కూడా సీఎం కేసీఆర్ లేఖ రాశారని వివరించారు. అయితే, మహిళా రిజర్వేషన్లో ఓబీసీ మహిళలకు కోటా లేకపోవడం ఆందోళకరమని, ఓబీసీ మహిళలకు న్యాయం చేయడం కోసం తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ సగం జనాభాను ఇంటికి పరిమితం చేస్తే దేశానికి మంచింది కాదని అభిప్రాయపడ్డారు. దీన్ని గమనించిన అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు మహిళా బిల్లుకు సానుకూలత వ్యక్తం చేశారని, తద్వారా మహిళా రిజర్వేషన్ సాకారమయ్యిందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడంపై చర్చ జరిపి రాజ్యాంగంలో పొందుపర్చారని, కానీ మహిళా నాయకులు మహిళా రిజర్వేషన్లను నిరాకరించారని చెప్పారు. అయితే, తమకు రాజకీయ పార్టీలు అవకాశం కల్పించడం లేదని 1970ల్లో మహిళలు గ్రహించారని, దాంతో మహిళలకు రిజర్వేషన్లపై చర్చ మొదలైందని అన్నారు. 1972లో భారత దేశంలో మహిళల పరిస్థితి అనే అంశాన్ని ఐక్యరాజ్య సమితి ఇతివృత్తంగా తీసుకుందని, ఆ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మహిళల పరిస్థితిపై విస్తృతంగా సర్వే నిర్వహించి మహిళా అంశాలపై దృష్టిసారించడం లేదని తేల్చిందని వివరించారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో మొదటగా గీతా ముఖర్జీ, సీపీఎం, సీపీఎం పార్టీలు, ఐద్వ సంస్థ కీలక పాత్ర పోషించాయన్నారు. మహిళా బిల్లు కోసం 1990ల్లోనే తన నియోజకవర్గం నిజామాబాద్ లోనే కాకుండా అనేక ప్రాంతాల్లో ధర్నాలు జరిగినా అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు. 1996లో దేవే గౌడ ప్రభుత్వం నుంచి మహిళా బిల్లు కోసం ప్రయత్నాలు జరిగి చివరికి ఇటీవల పార్లమెంటు బిల్లును ఆమోదించిందన్నారు. యూకే, అమెరికా, జపాన్ వంటి దేశాల్లో మహిళలకు ఓటు హక్కు కోసం దశాబ్దాల పాటు పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు.ఒకటి రెండు మినహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇప్పటికే అమలవుతున్నాయని, స్థానిక పరిపాలనలో మహిళల భాగస్వామ్యం దాదాపు 57 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల పదవుల్లో దాదాపు 55 శాతం మంది మహిళలే ఉండడం సంతోషంగా ఉందని చెప్పారు. మహిళల ఆరోగ్యంపై పరిశోధనా నివేదికలు, పుస్తకాలు కూడా పెద్దగా లేకపోవడాన్ని కూడా కవిత ప్రస్తావించారు. వైద్య పరిశోధనల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసేది కేవలం పురుషుల ఆరోగ్యంపై పరిశోధన చేయడానికేనా అని ప్రశ్నించారు. స్టార్టప్ రంగంలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. 10 స్టార్టప్ కంపెనీలు ఏర్పడితే మహిళా నేతత్వంలో కేవలం ఒకటి లేదా రెండు మాత్రమే ఉంటున్నాయని తెలిపారు. మహిళల నేతృత్వంలోని స్టార్టప్ లకు ఆర్థిక సాయం అందడం లేదని కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *