రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలోకి ఎందుకు వెళ్ళారో, మళ్లీ తిరిగి కాంగ్రెస్ లోకి ఎందుకు వెళ్ళారనేది ఎవరికీ అంతుపట్టని విషయమని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన రాజీనామా వల్ల రాష్ట్రం ఉప ఎన్నికను ఎదుర్కొని పరిపాలన అస్తవ్యస్తం అయిందని వ్యాఖ్యానించారు. డబ్బు మదంతో విర్రవీగుతున్న రాజగోపాల్ రెడ్డికి మునుగోడు లో బుద్ధి చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందని విమర్శించారు. మునుగోడు కాంగ్రెస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి ఆ పార్టీని వీడి బిఆర్ఎస్ లో చేరిన సందర్బంగా కేటిఅర్ మాట్లాడారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుటుంబం కాంగ్రెస్ పార్టీకి సంవత్సరాల పాటు అండగా నిలిచిందని, కాంగ్రెస్ పార్టీ పట్ల తన నిబద్ధత చాటుకుంటూ పార్టీ మారకుండా అంకిత భావంతో పనిచేసిన నాయకుడు గోవర్ధన్ రెడ్డి అని కొనియాడారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేసేందుకు ముందుకు రాకున్నా స్రవంతి పోటీ చేసి కాంగ్రెస్ కి గౌరవప్రద స్థానాన్ని కట్టబెట్టిందన్నారు. గోవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని వాడుకొని కాంగ్రెస్ పార్టీ పరువు దక్కించుకుందని, అలాంటి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ అవమానపరిచిందని కేటిఅర్ అన్నారు.