పదేళ్ల నిర్బంధ పాలన నుండి విముక్తి కావాలని, తమ బతుకుల్లో గొప్ప మార్పు రావాలని కోరుకున్న తెలంగాణ ప్రజలు ఇటీవల ఎన్నికల్లో ఆ దిశగా సుస్పష్టమైన తీర్పు ఇచ్చారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ప్రజల విజ్ఞతను అభినందించార. ఈ ప్రభుత్వంలో తెలంగాణ స్వేచ్చా వాయువులను పీల్చుకుంటోండని. నియంతృత్వ పాలన, పోకడల నుండి తెలంగాణ విముక్తి పొందిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభ, శాసన మండలి ఉభయ సభల నుద్దేశించి ఆమె ప్రసంగించారు.

నిర్బంధాన్ని సహించబోమని విస్పష్టమైన ప్రజాతీర్పు చెప్పిందన్నారు. ఈ తీర్పు పౌరహక్కులకు, ప్రజాస్వామ్య పాలనకు నాంది అయ్యిందన్నారు. పాలకులకు, ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగిపోయాయని, అడ్డుగోడలు, అద్దాల మేడలు పటాపంచలై ప్రజా ప్రభుత్వ ప్రస్థానం మొదలైందని గవర్నర్ చెప్పారు. శాసన సభకు వచ్చిన గవర్నర్ కు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసన సభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వాగతం పలికారు. అనంతరం, మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్ లు గవర్నర్ ను స్పీకర్ వేదిక వద్దకు సాదరంగా తీసుకువెళ్లారు.