ఆంద్రప్రదేశ్ రాజకీయల చర్చలు హైదారాబాద్ కేంద్రంగా మొదలయ్యాయి. తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నగరంలోని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లారు. ఇద్దరూ తాజా రాజకీయ పరిస్థితులు, రెండు పార్టీల పొత్తుల వ్యవహారం పై చర్చించారు. వైఎస్సార్సీపీ విముక్త ఆంధ్రప్రదేశే ప్రధాన అజెండాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఆదివారం రాత్రి కీలక చర్చలు జరిపారు. ఇరువురి నేతల మధ్య జరిగిన అంతర్గత భేటీలో 4 ప్రధాన అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన, ఎన్నికల ప్రచార శైలి, బహిరంగ సభల నిర్వహణపై చంద్రబాబు – పవన్ కల్యాణ్ మధ్య కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

సంక్రాంతి నాటికి ఈ అంశాలను ఓ కొలిక్కి తీసుకురావాలని ఇరువురు నేతలు ఓ అభిప్రాయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ, జనసేన పొత్తు కసరత్తు కీలక దశకు చేరింది. సీట్ల సర్దుబాట్లుపై గత రాత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత ప్రవన్ కల్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు. మరో రెండు విడతల సమావేశాల తర్వాత సంక్రాంతి నాటికి ఇది కొలిక్కి రానుంది. ఉమ్మడి మేనిఫెస్టోపైనా ఇద్దరు నేతలు సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న పవన్ కల్యాణ్ నివాసానికి ఆదివరాం రాత్రి చంద్రబాబు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు పవన్తో పాటు ఆయన భార్య అనా స్వాగతం పలికారు. ఇద్దరు నేతలూ సుమారు రెండున్నర గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చర్చల్లో పాల్గొన్నారు. ఏ పార్టీ ఎన్ని సీట్లల్లో పోటీ చేయాలి? ఎక్కడ నుంచి బరిలో దిగాలి అని నేతలు విస్తృతంగా చర్చించారు. ఉమ్మడి మేనిఫెస్టోల్లో ఏం అంశాలు పెట్టాలి? దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాలపైనా ఇద్దరి మధ్య చర్చ నడిచింది. ఉమ్మడిగా బహిరంగ సభల నిర్వహణ, ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి, ఎవరెవరు హాజరవ్వాలి? ఎప్పటి నుంచి వాటిని ప్రారంభించాలనే అంశాలపై కూడా ఇద్దరు నేతలూ చర్చించారు. అన్నీ కొలిక్కి వచ్చిన తరువాత బహిరంగ వేదికపైకి వచ్చి కీలక నిర్ణయాలను వెల్లడించనున్నారు. ఇదే వేదికపై నుంచి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది.తెలుగుదేశం, జనసేన శ్రేణులు ఇప్పటికే క్షేత్రస్థాయిల్లో కలిసి పనిచేస్తున్నాయి. ఓట్ల అక్రమాలపై అధికార వైఎస్సార్సీపీను ఎండగడుతున్నాయి. వివిధ అంశాల్లో అధికారపార్టీ అక్రమాలను అడ్డుకోవడంతోపాటు అసత్య ప్రచారాల్ని ఎలా తిప్పికొట్టాలనే విషయంలో కార్యకర్తలకు ఇరు పార్టీలు దిశానిర్దేశం చేయనున్నాయి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ పవన్ కల్యాణ్ సమక్షంలోనే ప్రకటించారు.