మళ్ళీ”నమో”…

IMG 20240312 WA0020

తెలంగాణ ప్రజల ఉత్సాహం చూస్తుంటే మోడీ మూడో సారి ప్రధాని కావడం ఖాయమనిపిస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భాజపా బూత్‌ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మోడీని మూడో సారి ప్రధానిగా చేద్దామా..? 400 ఎంపీ సీట్లను ఆయనకు కానుకగా ఇద్దామా..? అంటూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు.”ప్రస్తుతం దేశంలో ఎక్కడికి వెళ్లినా మోడీ నామ స్మరణే వినిపిస్తోందన్నారు. మజ్లీస్‌ అజెండా తోనే కాంగ్రెస్‌, భారాస పని చేస్తున్నాయని, కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా మజ్లీస్‌కు భయపడుతోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌, భారాస, మజ్లీస్‌ మూడూ వారసత్వ పార్టీలే అని, అవి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే చేస్తాయన్నారు. ఓబీసీల గురించి ఆ మూడు పార్టీలు ఎప్పుడైనా ఆలోచించాయా అని ప్రశ్నించారు. కేవలం వారసుల సంక్షేమం గురించి మాత్రమే ఆలోచిస్తాయన్నారు. కాంగ్రెస్‌ పాలన అంతా కుంభకోణాల మయమని, తెలంగాణ ప్రజలు భాజపాకు 12 ఎంపీ సీట్లు తగ్గకుండా ఇవ్వాలని కోరారు. మోదీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఏడాదికి రూ. 6 వేల చొప్పున వేస్తూ అండగా ఉంటోందని, వచ్చే ఐదేళ్లలో దేశమంత ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచి నీరు ఇస్తామని, ఇప్పటికే 14 కోట్ల ఇళ్లకు మంచి నీటి నల్లా కనెక్షన్లు ఇచ్చినట్టు షా తెలిపారు. పదేళ్ల యూపీఏ పాలనలో తెలంగాణకు రూ. 1.17 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయనీ, మోడీ పాలనలో ఇప్పటికే రాష్ట్రానికి రూ. 5 లక్షల కోట్లు వచ్చాయని వివారించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *