ఆ ఇద్దరు…

IMG 20250507 WA0107

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్ర మూక స్థావరాలపై భారత్ మెరుపు దాడి చేసింది. ఉగ్రవాదులు, వారికి ఆశ్రయం ఇచ్చే వారిని, ఆ కేంద్రాలను టార్గెట్ చేసింది. ఈ దాడుల్లో సుమారు 100 మంది వరకు చనిపోయి ఉంటారని భారత్ అంచనా వేస్తోంది. కానీ, పాకిస్తాన్ మాత్రం కేవలం ఎనిమిది మంది మాత్రమే చనిపోయినట్టు తెలిపింది. అయితే, ‘ఆపరేషన్ సిందూర్’కి సంబంధించి కేంద్రం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ దాడి ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? అక్కడే ఎందుకు జరిగిందనే అంశాలకు సంబంధించి విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మాట్లాడారు. ఇదే ప్రెస్ మీట్ కి ఇద్దరు మహిళలు ఒకరు ఆర్మీ, మరొకరు ఎయిర్ ఫోర్స్ యూనిఫాంలో కనిపించారు. దీంతో ఒక్కసారిగా తెరపైకి వచ్చిన వారిద్దరూ ఎవరనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. వారిలో ఒకరు కల్నల్ సోఫియా ఖురేషి, ఇంకొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. వారి గురించి ఒక్కసారి..

IMG 20250507 WA0106

కల్నల్ సోఫియా కురేషిది గుజరాత్‌ రాష్ట్రం. ఆమె తాత భారత సైన్యంలో సేవలందించారు, తండ్రి కూడా కొన్ని సంవత్సరాల పాటు సైన్యంలో పనిచేశారు.ఈ నేపథ్యంలో సోఫియాకు చిన్న వయస్సు నుంచే సైన్యంతో అనుంబంధం ఏర్పడింది. 1999లో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా సైన్యంలోకి అడుగుపెట్టారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ముఖ్యంగా తీవ్రవాద వ్యతిరేక ప్రాంతాలలో సిగ్నల్ రెజిమెంట్‌లలో సేవలు అందించారు.సోఫియా ఖురేషి సాధారణ అధికారి కాదు. ఆమె భారత సైన్యంలో సిగ్నల్స్ కార్ప్స్‌లో కల్నల్ ర్యాంక్‌ లో ఉన్నారు. 2016 మార్చిలో ఆమె “ఎక్సర్‌సైజ్ ఫోర్స్ 18″లో సైన్య బృందాన్ని నడిపిన మొదటి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. ఈ విన్యాసం, భారతదేశం ఆతిథ్యం ఇచ్చిన అతిపెద్ద విదేశీ సైనిక విన్యాసంగా పరిగణించబడుతుంది. ఈ కార్యక్రమంలో ఆసియాన్ సభ్య దేశాలతో పాటు భారతదేశం, జపాన్, చైనా, రష్యా, యునైటెడ్ స్టేట్స్, కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలు పాల్గొన్నాయి. ఈ విన్యాసంలో 18 బృందాలు పాల్గొన్నాయి, వీటిలో సోఫియా ఖురేషి ఒక్కరే మహిళా అధికారిగా బృందాన్ని నడిపారు.

ఇక వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నారు. యుద్ధ హెలికాప్టర్లు నడపడంలో ఎక్స్ పర్ట్. 2500 గంటలకు పైగా యుద్ధ విమానం నడిపిన అనుభవం ఉంది. ఎత్తయిన పర్వతాలు, అలాగే సముద్ర తీరాలు లాంటి భిన్న వాతావరణాల్లో కూడా ఆమె సమర్థంగా యుద్ద హెలికాప్టర్లను నడపగలరు. చాలా రెస్క్యూ మిషన్స్ కు ఆమె నేతృత్వం వహించారు. కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ లో అత్యవసర పరిస్థితులు, వరదలు వంటివి వచ్చినప్పుడు ఆమె సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఆరో తరగతి నుంచి తనకు పైలెట్ అవ్వాలని ఆశ ఉండేదని ఒక సందర్భంలో వ్యోమికా చెప్పారు. ఇంజినీరింగ్ అయ్యాక సైన్యంలో చేరారు. యుద్ధ హెలికాప్టర్ నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. కొన్ని కొన్ని సార్లు సెకన్లలో నిర్ణయాలు తీసుకోవాలి. ప్రకృతి నుంచి పొంచి ఉండే ప్రమాదాలను దాటుకుంటూ వెళ్లాలి. అయినా కూడా తను ఎక్కడా వెరవకుండా సేవలు అందిస్తున్నారు. వ్యోమికా పట్టుదల, అంకిత భావం, దేశ భక్తి కలిసి ఆమెను మరింత ముందుకు నడిపాయి. అందుకే చారిత్రక దాడిలో విజయం సాధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *