ఆంధ్రప్రదేశ్ నైపుణ్య శిక్షణ సంస్థ కేసులో అరెస్టు అయిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ఈ రాష్ట్ర హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం అయన మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. ఈనెల 28న మధ్యంతర బెయిల్ ముగిసినా గానీ చంద్రబాబు ఇక రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కానీ, ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరు కావాలని హైకోర్టు సూచించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై వాదనలు ఈనెల 17న ముగియడంతో తీర్పును ఉన్నత న్యాయస్థానం రిజర్వు చేసింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు.
రాజకీయ పెద్దలు చెప్పినట్లు ఏపీ సీఐడీ నడుచుకుంటోందని చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు 17న వాదనలు వినిపించారు. పోలీసులు చట్టానికి విధేయులై ఉండాలి తప్ప రాజకీయ నేతలకు కాదని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ దురుద్దేశపూర్వకంగా, రాజకీయ కక్షతో చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేశాయని, స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరారు. వాస్తవాలను దాచిపెట్టి అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. వృత్తి విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున బార్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయవచ్చు గానీ, తాము ఆ పని చేయట్లేదని తెలిపారు. అదే రోజు సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ ‘లొంగిపోయేటప్పుడు రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్కు సీల్డ్కవర్లో వైద్యనివేదికలు అందజేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పిటిషనర్ ఉల్లంఘించారు. ఆ నివేదికలు నమ్మశక్యంగా లేవు. బెయిల్ మంజూరుకు వాటిని పరిగణనలోకి తీసుకోనక్కర్లేదు. ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించాలి. మధ్యంతర బెయిల్ పొందిన చంద్రబాబు.. హైదరాబాద్ వెళ్లి ర్యాలీ నిర్వహించి, కోర్టు షరతులను ఉల్లంఘించారు. బేగంపేట పోలీసులు ఆయనపై కేసు నమోదుచేశారు. ఈ కేసులో ఇతర నిందితులకు బెయిల్ మంజూరయిందన్న కారణంతో పిటిషనర్కు బెయిల్ ఇవ్వాలని న్యాయవాదులు కోరడం సరికాదు. అందువల్ల బెయిల్ పిటిషన్ను కొట్టేయాలి’ అని కోరారు. ఇరుపక్షాల వాదనలు విని తీర్పును రిజర్వు చేసింది. దీనికి సంబంధించి తాజాగా బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది.