మీ రుణం తీర్చుకుంటా..

IMG 20240711 WA0018

ఉత్తరాంధ్ర “సుజల స్రవంతి” పూర్తైతే ఆ ప్రాంతంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సుజల స్రవంతిని పూర్తి చేస్తే ఉత్తరాంధ్ర ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లాలో 2.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఉత్తరాంధ్రలో చంద్రబాబు నాయుడు పర్యటించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం దార్లపూడి వద్ద గురువారం పోలవరం ఎడమ కాల్వను పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సుజల స్రవంతి పనుల్లో టీడీపీ హయాంలో చేసిన పనులు తప్ప గత ప్రభుత్వంలో ఒక్క ముందడుగు పడలేదన్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని, ఒక్క ఇంచు కూడా పని ముందుకు కదల్లేదన్నారు. ఐదేళ్లలో ఎక్కడైనా తట్ట మట్టి వేశారా? అని ప్రశ్నించారు. ఓట్లు వేసి గెలిపించిన వారి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది.

IMG 20240711 WA0012

రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాల తర్వాత ఎక్కువ ఆదరించిన ప్రాంతం ఉత్తరాంధ్ర. కూటమి అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపించారు. మీ రుణం తీర్చుకోవడానికే ఇక్కడికి వచ్చా. భగవంతుడు నాకు ఇచ్చిన శక్తినంతా ఉపయోగించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటా. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి కూటమిగా వచ్చాయి. అరాచకాలు చేసిన వ్యక్తిని, తప్పులు చేసిన వ్యక్తిని ప్రజాకోర్టులో శిక్షించారు. రాజకీయాల్లో విర్రవీగితే సరిచేసే శక్తి ప్రజలకే ఉంది. ప్రజలు గెలవాలి. రాష్ట్రం నిలబడాలని ఎన్నికల ముందు ప్రచారం చేశాం. ఇప్పుడు ప్రజలు గెలిచారు. రాష్ట్రాన్ని నిలబెట్టడానికి మేము కష్టపడతాం. ఇప్పటికే పోలవరం, అమరావతి, విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశాం. పోలవరంను 72 శాతం నేను పూర్తి చేశాను. ఒక దుర్మార్గుడు వచ్చి డయాఫ్రం వాల్ ను గోదావరిలో కలిపేశారు. కాఫర్ డ్యామ్ లు డ్యామేజ్ అయ్యాయి. 2021 జూన్ కు నీళ్లు రావాల్సి ఉండగా నిర్వీర్యం చేశారు. పోలవరం రాష్ట్రానికి వరం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసి పోలవరం ద్వారా గోదావరి నీళ్లు తీసుకొస్తే ప్రతి ఎకరాకు నీరు అందించొచ్చు. కరువు అనే సమస్య ఉండదు. గత ప్రభుత్వ నిర్వాకంతో పోలవరం పూర్తవ్వడానికి ఆలస్యం అవుతోంది. అందువల్ల పురుషోత్త పట్నం, పుష్కర్ లిఫ్ట్ ద్వారా 2,500 క్యూసెక్కుల నీటిని ఈ ప్రాంతానికి తీసుకురావొచ్చు. అండర్ పాస్ లకు కూడా టెండర్లు పిలిచి త్వరితగతిన పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. మొదటి విడతగా కాలువను 93 కి.మీ పూర్తి చేయడానికి రూ.800 కోట్లు ఖర్చు అవుతుంది. దీంతో లక్ష ఎకరాలకు అనకాపల్లి పరిధిలో నీరందించవచ్చు. ఇప్పుడే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం. యాక్షన్ ప్లాన్ తయారు చేశాక మరింత వేగవంతంగా పనులు పూర్తి చేస్తాం. ఉమ్మడి తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో 4 లక్షల ఎకరాలకు పోలవరం కుడి కాల్వ ద్వారా సాగునీరు అందించవచ్చు. 23 టీఎంసీల నీళ్లతో అనకాపల్లి జిల్లాలో ఇంటింటికీ కుళాయిల ద్వారా నీరందించవచ్చు. రూ.800 కోట్లు ఖర్చు చేసి 93వ కి.మీ వరకు 2.20 లక్షల ఎకరాలకు నీరందించేందుకు మొదటి విడతలో పనులు పూర్తి చేస్తాం. ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంశధార నది దాకా వెళ్తుంది. వంశధార-గోదావరి-కృష్ణా-పెన్నా నదులు అనుసంధానం చేసి రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తాం.’’ అని సీఎం స్పష్టం చేశారు.

IMG 20240711 WA0015

గత అసమర్థ ప్రభుత్వం కారణంగా మూడు షుగర్ ఫ్యాక్టరీలు పడకేశాయన్నారు. ఇక్కడి రైతులకు కూడా న్యాయం జరగాలని, వారి భాగస్వామ్యంతోనే ఫ్యాక్టరీలు నడవాలని ఆ ఆలోచనతోనే రైతులకు న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. శాశ్వతంగా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.. నేను కష్టపడతాను, సంపద సృష్టించి ఆదాయం పెంచి పేదలకు పంచుతమని చెప్పారు.మీకు వెసులుబాటు ఇవ్వాల్సిన బాధ్యత ఎన్డీయే ప్రభుత్వంపై ఉంది. దేశంలో ఎక్కడా ఇవ్వని విజయాన్ని ఏపీ ప్రజలు ఎన్డీయేకు ఇచ్చారు. ఇది చారిత్రక విజయమని, 95 వేల మెజారిటీతో అభ్యర్థులను గెలిపించారనీ మీ రుణం తీర్చుకోవడం మా బాధ్యత అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దొంగ మాటలు చెప్పేవాళ్ల మాటలు నమ్మి బజారులో తిరగనిస్తే బతుకులు ఏమవుతాయో ఆలోచించాలని సీఎం సూచించారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఏ విధంగా కాపాడుకోవాలో ఆలోచిస్తున్నామని, కానీ ఒక పనికి మాలిన పార్టీ ఉంది.. ఆ పార్టీ నేతల పొట్ట నిండా అబద్ధాలే. వారికి కల వచ్చిందంటా, అమ్మడానికి నేను ఒప్పుకున్నానని, తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక విశాఖ ఉక్కు “విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు” అని పోరాడి ఫ్యాక్టరీని సాధించుకున్నామని బాబు అన్నారు. నాడు ప్రైవేట్ పరం చేస్తామని ప్రతిపాదనలు వచ్చినప్పుడు నేను పోరాడి అడ్డుకున్నా, కేంద్రం నుండి ఆర్థిక సాయం కూడా తీసుకొచ్చామని, స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునే బాధ్యత తమ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. కరుడుగట్టిన ఆర్థిక ఉగ్రవాదులు విశాఖను దోచేశారని, వాళ్లను వదలిపెట్టనని చెప్పారు. “సూపర్-6” హామీలను కూడా త్వరలో అమలు చేయనున్నట్టు, ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. భూములు కొట్టేసేందుకు తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను కూడా రద్దు చేసినట్టు తెలిపారు. 183 అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 నుండి ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *