“గ్లోబల్ హబ్”గా విశాఖ..

IMG 20240711 WA0026

గ్లోబల్ హబ్ గా విశాఖపట్నం మెడిటెక్ జోన్ తయారవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీని వైద్య రంగంలో మొదటి స్థానంలో నిలపాలన్న ఉద్దేశంతోనే తమ హయాంలో మెడ్‌టెక్ జోన్ ఏర్పాటు శ్రీకారం చుట్టామన్నారు. మెడ్ టెక్ జోన్ ప్రతినిధులు, సిబ్బందితో గురువారం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మెడ్ టెక్ జోన్ లో మరో రెండు కంపెనీలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో వైద్య పరికాల కోసం మెడిటెక్ జోన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఇది అసాధ్యం అని చాలా మంది అన్నారు. కానీ ఇప్పుడు మెడిటెక్ జోన్ సాధిస్తోన్న విజయాలను చూస్తే చాలా ఆనందంగా ఉంది. 2019లో ప్రభుత్వం మారడంతో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి, దీంతో పెట్టుబడులు పెట్టేందుకు కూడా చాలా మంది ఆసక్తి చూపలేదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో సంస్థ ప్రతినిధులు ముందుకు నడిపించారన్నారు.

IMG 20240711 WA0039

1999లో నేను రెండో సారి ముఖ్యమంత్రి అయ్యాక బయోటెక్నాలజీకి శ్రీకారం చుట్టాను. బయో టెక్నాలజీ పార్క్ కి 2 వేలు ఎకరాలు కేటాయించాను. ఇప్పుడు అక్కడ 700 విభాగాల్లో 30 వేల మంది పని చేస్తున్నారు. భారత్ బయో టెక్ తయారు చేసిన వ్యాక్సిన్ తో దేశాన్ని కాపాడుకోగలిగాం. అక్కడ తయారైన వ్యాక్సిన్ ను మన ప్రధాన మంత్రి మోదీ ఇతర దేశాలకు అందించారు. 3వ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక విశాఖలో శర్మ నాయకత్వంలో మెడ్ టెక్ జోన్ ఏర్పాటుకు ముందుకొచ్చాం. కోవిడ్ సమయంలో ఇక్కడి నుండి వెంటిలేటర్లు, ఆక్సీజన్ కాన్సిట్రేటర్లు, మొబైల్ కంటెయినర్ యూనిట్, ఐ ల్యాబ్, ఆర్టీపీసీఆర్ తయారయ్యాయి. రోజుకు 100 వెంటిలేటర్లు ఇక్కడ తయారవుతున్నాయి. ఇతర మెడికల్ సామాగ్రిని అందించి కోట్లాది మంది ప్రజల ప్రాణాలు కాపాడారు. ఈ ఫలితాలను చూసి నేను చాలా సంతోషించాను. 275 ఎకరాల విస్తీర్ణంలో 140కి పైగా కంపెనీలు ఇక్కడ పని చేస్తూ 10 వేల కోట్ల టర్నోవర్ జరుగుతోంది. 6 వేల మంది ఉపాధి పొందుతున్నారు.

IMG 20240711 WA0038

కోవిడ్ సమయంలో 20 రాష్ట్రాల వారు ఇక్కడ తయారైన సామాగ్రినే వినియోగించినప్పటికీ ఏపీలో గత ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. రానున్న రోజుల్లో భోగాపురం విమానాశ్రయం కూడా అందుబాటులోకి వస్తుంది. విశాఖపట్నం నా మనసుకు ఎంతో దగ్గరైన నగరం. ఇక్కడి ప్రజలు చాలా తెలివైన వారు, మంచి స్వభావం కలవారు. 2014లో హుద్ హుద్ తుఫాన్ సంభవించినప్పుడు సుమారు 10 రోజులు ఇక్కడే ఉండి నగరాన్ని మళ్లీ యధాస్థితికి తీసుకొచ్చిన తర్వాతే ఇక్కడి నుండి వెళ్లాను. ఆ కృతజ్ఞతగానే 2019 ఎన్నికల్లో విశాఖ పరిధిలో 4 స్థానాల్లోనూ మా పార్టీ అభ్యర్థులను ప్రజలు గెలిపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులకు భారీ విజయాన్ని అందించారు. స్థానిక ఎంపీకి 5 లక్షలకు పైగా మెజారిటీ వచ్చింది. గాజువాకలో 95 వేలు, భీమిలిలో 94 వేల ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేలను గెలిపించారు. గెలిచిన ప్రతి అభ్యర్థీ భారీ మెజారిటీతో గెలిచారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక పోలవరం, అమరావతి సందర్శించిన తర్వాత మొదటి సారి విశాఖపట్నం వచ్చాను. మెడిటెక్ జోన్ కు అన్నివిధాలా సాయం అందించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి సహకారం అందిస్తామని చంద్రబాబు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *