నూతన పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ భవనంగా నామకరణం చేయాలని, ఆ భవనంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని భీమ్ ఆర్మీ చంద్రశేఖర్ ఆజాద్ చేస్తున్న డిమాండ్ కి తెలంగాణ ప్రజల మద్దతు ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. రెండు రోజుల పర్యటన కోసం హైదరాబాద్ వచ్చిన చంద్రశేఖర్ ఆజాద్ కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని దర్శించడంతో పాటు సీఎం కేసీఆర్ ను కలుసుకోవడానికి ఆహ్వానించామని, ఆహ్వానాన్ని మన్నించి రెండు రోజుల పర్యటనకు వచ్చిన చంద్రశేఖర్ ఆజాద్ కు కవిత కృతజ్ఞతలు తెలిపారు.

దేశంలో అందరూ చరిత్రను మరిపించే ప్రయత్నం చేస్తుంటే, తెలంగాణలో చరిత్రను శాశ్వతంగా ఉంచేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చంద్రశేఖర్ ఆజాద్ అనడం సంతోషంగా ఉందని తెలిపారు. వెనుకబడిన వర్గాల కోసం ఆజాద్ చేస్తున్న పోరాటానికి తెలంగాణ ప్రజల అండ ఉంటుందని, అటువంటి పోరాటాల్లో తాము కలిసి వస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తమ రాజకీయ విధానాలు, తెలంగాణలో బహుజనులకు, దళితులకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి చర్చించారు. దళిత బంధు పథకాన్ని ఆజాద్ ప్రశంసించారని కవిత చెప్పారు. అనంతరం వారిద్దరూ కలిసి సచివాలయం వద్ద ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని దర్శించారు. అంబేద్కర్ కి పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత అమర జ్యోతి వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.