“ప్రపంచ సుందరి” కిరీట పోటీల ప్రారంభానికి సమయం దగ్గర పడింది. ఈ నెల పదో తేదీ సాయంత్రం హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు అధికారికంగా మొదలవుతాయి. దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం విసృత స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసేందుకు యంత్రాంగం కృషి చేస్తోంది. ఈ ఏర్పాట్లన్నీ దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి ఇప్పటికే 115 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారులు హైదరాబాద్ చేరుకున్నారు. రానున్న రెండు రోజుల్లో మరికొంత మంది ప్రతినిధులు వివిధ దేశాల నుంచి వస్తారని నిర్వాహకులు తెలిపారు. వీరికి తోడు 28 మంది మిస్ వరల్డ్ సంస్థ నుంచి నిర్వహణ ప్రతినిధులు, 17 మంది సహాయకులు వచ్చారు. గత వారం రోజులుగా వస్తున్న అతిధులు అందరినీ తెలంగాణ సంసృతీ, సాంప్రదాయాలకు అనుగుణంగా స్వాగతం పలుకుతూ వారికి బస ఏర్పాట్లను టూరిజం శాఖ కల్పించింది. విదేశీ ప్రతినిధులు బస చేసిన ట్రిడెంట్ హోటల్ దగ్గర పోలీసులు భారీ భద్రతకల్పించారు. పోటీలో పాల్గొనే వారు రిహార్సల్స్ కార్యక్రమాల్లో మునిగిపోతున్నారు. పోటీదారులను వివిధ గ్రూపులుగా ఏర్పాటు చేసి వారు పాల్గొనే కార్యక్రమాల గురించి నిర్వాహకులు వివరిస్తున్నారు.

వివిధ దేశాలకు చెందిన వారు విభిన్న కార్యక్రమాలు, తెలంగాణలో ఉన్న చారిత్రక, పర్యాటక ప్రదేశాల సందర్శనలో పాల్గొంటారు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ, మహిళలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను కూడా మిస్ వరల్డ్ కంటెస్ట్ లో భాగంగా చేపడుతున్నారు. “ఇక పై తెలంగాణ జరూర్ ఆనా” (తప్పకుండా తెలంగాణ రండి, పర్యటించండి.) అనే నినాదాన్ని విసృతంగా ప్రపంచవ్యాప్తం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా పర్యాటకరంగం పెరగటం, పెట్టుబడుల సాధన, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఈవెంట్ గురించి రాష్ట్ర ప్రభుత్వం దేశ విదేశాలతో పాటు అన్ని రాష్ట్రాల ప్రధాన విమానాశ్రయాల్లో ప్రచారం కల్పిస్తుంది. మిస్ వరల్డ్ 2025 పోటీలు విజయవంతంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మే 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగే ప్రపంచ స్థాయి పోటీల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. తెలంగాణ ఖ్యాతిని విశ్వమంతటా పరిచయం చేసేందుకు ఉపయోగపడే మిస్ వరల్డ్ 2025 వేడుకలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలనిఅన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 116 దేశాలకు చెందిన యువతులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి ఆతిథ్యమివ్వాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. పోటీదారులతో పాటు దేశ విదేశాల నుంచి ఈవెంట్ కవరేజీకి దాదాపు మూడు వేల మంది మీడియా ప్రతినిధులు హాజరవుతారని అన్నారు. వివిధ దేశాల నుంచి పోటీలకు వచ్చే వారిని తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో స్వాగతించాలని, పోటీలు పూర్తయ్యేంత వరకు ఎక్కగా పొరపాటు లేకుండా ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. పర్యాటక శాఖతో పాటు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని, అధికారులందరూ సమర్థంగా తమకు అప్పగించిన బాధ్యతలు నిర్వహించాలని ఆదేశించారు.

గచ్చిబౌలి ఇండోర్ స్డేడియంలో మిస్ వరల్డ్ ప్రారంభోత్సవం నుంచీ 31వ తేదీన జరిగే గ్రాండ్ ఫినాలే వరకు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని చార్మినార్ , లాడ్ బజార్ లతో పాటు తెలంగాణ తల్లి, సెక్రెటేరియట్తో పాటు రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాంతాలను మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్న నేపథ్యంలో, అవసరమైన రవాణా, వసతులు కల్పించాలన్నారు. అక్కడ భద్రత కట్టుదిట్టంగా ఉండేలా చూసుకోవాలన్నారు. అవాంఛనీయ పరిస్థితులు తలెత్తినా వాటిని అధిగమించే ప్రత్యామ్నాయ ప్రణాళికలను అధికారులు రూపొందించుకోవాలని ఆదేశించారు. మహిళా సాధికారతను చాటిచెప్పేలా రాష్ట్రంలో ఐకేపీ మహిళలు నిర్వహిస్తున్న డ్వాక్రా బజార్ సందర్శనతో పాటు, ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ సెమీ ఫైనల్స్ తిలకించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాతావరణ సూచనలకు అనుగుణంగా తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, ఈదురు గాలులు, వర్షాలు వచ్చినా గ్రేటర్ సిటీ పరిధిలో ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీతో పాటు హైడ్రా విభాగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మిస్ వరల్డ్ కు వచ్చే విదేశీ అతిథులు బస చేసే హోటళ్లతో పాటు గచ్చిబౌలి స్టేడియం, చార్మినార్, లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలెస్, సెక్రెటేరియట్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులతో పాటు వివిధ రంగాల్లో ప్రముఖులను ప్రభుత్వం తరఫున మిస్ వరల్డ్ 2025 ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకులాలు, బీసీ, ఎస్సీ ఎస్టీ వెల్పేర్ రెసిడెన్షియల్ స్కూళ్లు, మోడల్ స్కూళ్లు, కస్తూరిబా పాఠశాలలకు చెందిన విద్యార్థులను కూడా ఒకరోజు మిస్ వరల్డ్ వేడుకలు చూపించాలని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వేడుకలు జరిగే రోజుల్లో హైదరాబాద్ అంతటా మిస్ వరల్డ్ సందడి కనిపించేలా తోరణాలు, లైటింగ్, హోర్డింగ్ లతో పాటు సిటీలోని ముఖ్యమైన జంక్షన్లు, చారిత్రకప్రదేశాలను అందంగా అలంకరించాలని అన్నారు.

