హైదరాబాద్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లిలోని బజార్ఘాట్లోని కెమికల్ గోడౌన్లో సోమవారం ఉదయం భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకొని తొమ్మిది మంది కార్మికులు దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నాలుగు అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మూడు ఫైరింజన్లతో మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. మరికొంతమంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం.
కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు నాలుగు అంతస్తులు మొత్తం మంటలు వ్యాపిస్తుండటంతో అపార్ట్మెంట్లో ఉన్న వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటి వరకు 15 మందిని డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది రక్షించారు. జనావాసాల మధ్య ప్రమాదం జరగడంతో.. దట్టమైన పొగ, ఘాటైన కెమికల్ వాసనలతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.