ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్- అబ్దొల్లహియన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాదంలో హెలికాప్టర్ లో ఉన్న వారంతా మృతి చెందారు.

ఇరాన్, అజర్ బైజాన్ సరిహద్దుల్లో నిర్మించిన కిజ్ కలాసీ, ఖొదా ఫరీన్ అనే రెండు డ్యామ్ లను ఇబ్రహీం రైసీ ప్రారంభించారు. ఆ తర్వాత తబ్రిజ్ నగరానికి బయలు దేరారు. అప్పుడే హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్న ప్రదేశాన్ని గుర్తించి సైనిక అధికారులు హెలికాప్టర్ శకలాలను గుర్తించారు. అద్యక్షుడు రైసి సహా ఆయనతో ప్రయాణిస్తున్న మంత్రి, ఇతర అధికారులు ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ ప్రభుత్వం తెలిపింది.