సభ్య సమాజం నివ్వెరపోయే కిరాతక సంఘటన ఇది. తల్లిదండ్రులు తలలు మొలలో పెట్టుకోవాలి, పాలకులు, విద్యా వ్యవస్థ సిగ్గు పడాలి. చదువుకొని దేశానికి ఉపయోగపడాల్సిన విద్యార్ధులు హంతకులుగా మారడం ఆందోళనకర పరిణామం. నల్లగొండ జిల్లాలో జరిగిన ఒక సంఘటన అత్యంత భయానకంగా ఉంది. చెడు వ్యాసనాలకు అలవాటు పడ్డ విద్యార్ధులు దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్న సంఘటనలే చూస్తున్నాం. కానీ, ఈ సంఘటన దీనికి పూర్తీ భిన్నమైంది. సామాన్యుల ఊహకు కూడా అందని దురదృష్టకర ఘోరం. బరితెగించిన కొందరు విద్యార్ధులు ఏకంగా హెడ్ మాస్టర్ నే హతమార్చిన ఘటన దేశ భవిష్యత్తును వెక్కిరిస్తోంది. వివరాల్లోకి వెళ్తే…
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి (45) ని హత్య సంగతి తెలిసిందే. అయితే, ఆ చదువుల తల్లిని హత్యమార్చింది ఆమె విద్యా బుద్ధులు నేర్పే విద్యార్ధులే కావడం విషాదకర అంశం. గంజాయి, విచ్చలవిడి జల్సాలకు అలవాటుపడ్డ పదవ తరగతికి చెందిన కొందరు విద్యార్దులు డబ్బు కోసం ఆమెను హతమార్చారు. ఈ నెల 11న సాయంత్రం స్కూల్ ముగించుకొని ప్రిన్సిపాల్ రూపారెడ్డి ఇంటికి వచ్చారు. అంతకంటే ముందే గోడ దూకి రూపారెడ్డి ఇంట్లోకి చొరబడ్డ నిందితులు ఆమె బెడ్రూమ్లోకి వెళ్లగానే వెనుక వైపు నుంచి వచ్చి కత్తితో దాడికి దిగి 27 సార్లు పొడిశారు. ఆ తర్వాత సుమారు 4 లక్షల రూపాయలు దొంగిలించారు. ఆ డబ్బుతో హైదరాబాద్లో జల్సాలు చేశారు. ఇదే సందర్భంలో ఎవరికీ అనుమానం రాకుండా, సీసీ కెమెరాల్లో చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. హత్య అనంతరం జల్సాలు చేసి, యధావిధిగా స్కూల్కు వస్తూ, అన్నీ గమనిస్తూ ఎవరికి అనుమానం రాకుండా వ్యవహరించడం గమనర్హం, ఈ కేసులో దాదాపు 80 మందిని విచారించిన అనంతరం, కొండమల్లేపల్లి మండలంలోని రెండు తండాలకు చెందిన ముగ్గురు విద్యార్థులే హత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు హత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు దృష్టి సారించారు.
