అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యయత్నం జరిగింది. కాల్పుల దాడిలో ఆయన తృటిలో బతికి బయట పడ్డారు. పెన్సిల్వేనియా రాష్ట్రం లోని బట్లర్ సిటీలో ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. బుల్లెట్కు కుడి చెవికి రాసుకుంటూ దూసుకు పోవడంతో ఆ చెవికి గాయం గాయమైంది. బుల్లెట్ చెవికి తాకడంతో అప్రమత్తమైన ట్రంప్ వెంటనే నేలపై వంగి పోయారు. భద్రతా సిబ్బంది ట్రంప్ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. దుండగుడి కాల్పుల్లో సాధారణ పౌరుడు మరణించినట్లు సమాచారం.

మరోవైపు, ట్రంప్ పై కాల్పులు జరిపిన నిందితుడిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. కాల్పులలో గాయాల పాలైన ట్రంప్ ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గానే ఉన్నట్లు ఆయన ప్రతినిధి స్టీవెన్ తెలిపారు. స్థానిక మెడికల్ సిబ్బంది ఆయనకు చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, గాయపడిన అనంతరం ట్రంప్ పిడికిలి బిగించి నినాదాలు చేశారు.

‘కాల్పుల్లో గాయపడిన ట్రంప్ క్షేమంగా ఉన్నారని తెలిసింది. ట్రంప్, ఆయన కుటుంబం కోసం నేను దేవుడిని ప్రార్థిస్తున్నా. మనం అందరం ఒక్కటై ఈ ఘటనను ఖండించాలి’ అని ప్రెసిడెంట్ జో బెడెన్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు స్థానం లేదని బరాక్ ఒబామా ట్వీట్ చేశారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
తనపై హత్యాయత్నం తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తొలిసారి స్పందించారు. ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో శబ్దంతో ఏదో చెవిపై దూసుకుపోయినట్లు అర్థమైందని చెప్పారు. రక్తస్రావం జరగడంతో ఏమైందో గ్రహించినట్లు పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమై మోకాళ్లపై కూర్చున్నట్లు వెల్లడించారు. దేశంలో ఇలాంటి ఘటన జరగడం నమ్మశక్యంగా లేదన్నారు.