అతలాకుతలం…!

wethr

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ మిచౌంగ్  తుపాను ఆంధ్రప్రదేశ్ లోని పలుజిల్లాలను అతలాకుతలం చేస్తోంది. వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలు, ఈదురు గాలులు జన జీవనాన్ని స్తంభిపజేశాయి. తుపాను ప్రభావం వల్ల ఉభయగోదావరి, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక పట్టణాలు, గ్రామాలు జలమయం అయ్యాయి. తాజా సమాచారం మేరకు  నెల్లూరుకు 50 కి.మీ, బాపట్లకు 110 కి.మీ, మచిలీపట్నానికి 170కి.మీ. దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రానికి  నెల్లూరు – మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర మిచౌంగ్  తీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు.

weathr

దీనివల్ల  తీరం వెంబడి గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు, కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండి.ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే ముందుజాగ్రత్తగా పలు రైళ్ళను రద్దుచేసింది. తుపాను తీవ్రత తెలంగాణ జిల్లాలను కూడా తాకింది. గడిచిన 20 సంవత్సరాల్లో నిజాంపట్నం హార్బర్ లో పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.  ఈదురు గాలులు, వర్షాలతో ప్రజలు సతమతం అవుతున్నారు. తుపాను ప్రభావం అధికంగా ఉన్న పొరుగు రాష్ట్రం తమిళనాడులో విధులే చెరువులుగా మారాయి. చెన్నై విమానాశ్రయంలో వర్షపు నీరు మోకాళ్ళ లోతుకు చేరడంతో అన్ని విమాన సర్వీసులను రద్దుచేశారు.  తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగమేఘాలపై స్పందించి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. మూడు రోజుల ముందు నుంచే జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వచ్చింది. సోమవారం సీఎం వైయ‌స్‌ జగన్‌ జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి తుపాను వల్ల ఎక్కడా ఇబ్బందికర పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సహాయ, పునరావాస కార్యక్రమాలకు సంబంధించి రెవెన్యూ శాఖ ఐదు జీఓలు, ఒక మెమో విడుదల చేసింది. సీఎం ఆదేశాలతో 10 జిల్లాల్లో తుపాను అత్యవసర సహాయక చర్యల కోసం ఆయా జిల్లాల కలెక్టర్లు రూ.11 కోట్లను అత్యవసరంగా డ్రా చేసుకునేందుకు అనుమతి ఇస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ జీఓ నంబరు 72 జారీ చేశారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు రూ.2 కోట్లు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలకు రూ.కోటి చొప్పున వినియోగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిధులను వర్ష ప్రభావిత ప్రాంతాల నుంచి బాధితులను సహాయక శిబి­రా­లకు తరలించడం, ఆయా ప్రాంతాల్లో సురక్షిత­మైన తాగునీరు, ఆహారం, పాలు అందించడంతోపాటు వారికి అవసరమైన ఆరోగ్య శిబిరాలు, పారిశుధ్య నిర్వహణ, పశువులకు ఆహారం, కూలిపోయిన లేక దెబ్బతిన్న ఇళ్లకు తక్షణ పరిహారం ఇచ్చేందుకు వినియోగించాలని ఆదేశించింది.  తుఫాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లకు పంపుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలిపారు. అత్యవసర సహాయక చర్యల కోసం నెల్లూరులో 4, బాపట్లలో 3, కృష్ణాలో 2, తిరుపతి, ప్రకాశంలో ఒక్కొక్క బృందం చొప్పున మొత్తం 5 ఎన్డీఆర్‌ఎఫ్, 6 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయని తెలిపారు. కృష్ణా, బాపట్ల, ప్రకాశం, ఎస్పీఎస్సార్‌ నెల్లూరు, తిరుపతి, కాకి­నాడ, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల్లో 192 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, సోమవారం సాయంత్రం వరకు 7,361 మం­దిని తరలించామన్నారు. ప్రభావిత జిల్లాల్లోని 2.38 కోట్ల మందికి తుపాను హెచ్చరిక సందేశాలు (సెల్‌ ఫోన్‌కు) పంపినట్లు తెలిపారు. కృష్ణా జిల్లాలో 64 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మచిలీపట్నం, అవనిగడ్డ ప్రాంతాలకు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, గజ ఈతగాళ్ల బృందాలు చేరుకున్నాయి. జిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబు, ఎస్పీ పి.జాషువా నేతృత్వంలో శిబిరాల్లో తాగునీరు, ఆహారంతో పాటు వైద్య సహాయం కోసం వైద్య సిబ్బంది, మరుగుదొడ్లను, వైర్‌లెస్‌ సెట్లను ఏర్పాటు చేశారు. 40 వేల టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. మరో 20 వేల టన్నుల ధాన్యాన్ని గోడౌన్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *