ప్రజల సమ్మతి, వారి ఆకాంక్షల మధ్య అధికారాన్ని చేపట్టిన ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేయడం నిజంగా రాజ ద్రోహం కిందికే వస్తుంది. తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి భారత రాష్ట్ర సమితి అధినేతలు చేస్తున్న ప్రసంగాలు, ప్రకటనలు తెలంగాణ ప్రజలను విస్తుపరుస్తున్నాయి. ఈ లోక్ సభ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరతారని, ఇప్పటికీ 20 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమతో బేరసారాలు చేస్తున్నారని సాక్షాత్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ ప్రకటనలు చేయడం అంతుపట్టకుండా ఉంది. ఆ పార్టీకి చెందిన నేతలలో రోజుకొకరు కాంగ్రెస్, భాజాపా వైపు గోడలు దూకుతున్న విషయం తెలిసి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలి పోవడం ఖాయం అని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలు ఊక దంపుడు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉంది.

పదేళ్ల పాలనలో అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ “ఒంటెద్దు”కు వంత పాడే నేతలు పూర్తీ స్థాయి మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని కూల దోయాలనే ఆలోచన చేయడం నిజంగా కుట్ర కోణమే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో అది పడి పోతుందని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన కేటీఆర్, హరీష్ రావుల మాటలు ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలే అని తెలిపోవడంతో ఇప్పుడు భారాస అధినేత కేసీఆర్ కొత్త గళం ఎత్తుకున్నారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం తథ్యమనే కొత్త అంశాన్ని ఈ ఎన్నికల సమయంలో తెర పైకి తెచ్చారు. భాజాపాను ప్రభుత్వాలు కూల్చే పార్టీగా చిత్రీకరించడం, కేసీఆర్ మాటలకు తెలంగాణాలోని బిజెపి నేతలు సైతం నోరు మెదపక పోవడం ఆలోచించాల్సిన అంశం.
కుతంత్రాల అడ్డాగా “ఫామ్ హౌస్”…!
పదేళ్లుగా తెలంగాణలో జరిగిన అక్రమాలకు తీహార్ జైలులో ఉన్న సొంత కూతురు కవిత ప్రత్యక్ష సాక్ష్యం అన్న నిజాన్ని మరచి పోయి కేసిఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం భారాస నేతలకు సైతం ఒంట పట్టడం లేదు. కవిత రూపంలో అవినీతి తిమింగళాన్ని కళ్ళ ముందే పెంచి పోషించిన ఉద్యమ అధినేత పదవి పోవడంతో దిక్కుతోచని స్థితికి వెళ్లిపోయారని, అందుకే ఆ అక్కసును ప్రభుత్వం పై వెళ్ళ గక్కుతున్నారని పొంగులేటి, భట్టి వంటి కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణా తమ సొత్తు అయినట్టు, దోచుకున్నది సరిపోనట్టు ఇంకా ప్రభుత్వం పైనా, ప్రజల పైనా పెత్తనం చేలాయించాలనే ఎత్తు గడలు వేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారనే కనీస విజ్ఞత లేకపోవడం భారాస నేతల అజ్ఞానానికి అద్దం పడుతోందని అటు ఒకవైపు రాజకీయ పక్షాలు, మరోవైపు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పదేళ్ల పాటు ప్రజల భిక్షతో ప్రగతి భవన్ ని అడ్డాగా చేసుకొని అధికారం చెలాయించిన కేసిఆర్ ఎన్నికల్లో ఓటమి చవి చూడగానే ప్రజలకు కనీస కృతజ్ఞత లేకుండా రాత్రికి రాత్రే ఫామ్ హౌస్ కి పయనం అయిన సన్నివేశాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్, భాజాపా నేతలు గుర్తు చేస్తున్నారు. “మా ఎమ్మెల్యేలను కంచె వేసి కాపాడుకుంటాం.. ఇక్కడున్నది రేవంత్ రెడ్డి.. సాయంత్రానికి నీ దొడ్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో లెక్కపెట్టుకో” అంటూ హెచ్చరించారు. అంతేకాదు, తనో హై టెన్షన్ వైరు అని, తాకడానికి ప్రయత్నిస్తే మసై పోతావని కూడా రేవంత్ చేసిన వ్యాఖ్యలు భారాస అగ్ర నేతల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచనలు చేస్తే తెలంగాణ భవన్ ని నామరూపాలు లేకుండా చేస్తామనే మరో కాంగ్రెస్ మంత్రి చేసిన వార్నింగ్ కూడా గులాబీ దళంలో చర్చకు దారి తీసింది. ప్రజా స్వామ్య పద్ధతిలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి బాధ్యత గల ప్రతిపక్షంగా సలహాలు,సూచనలు ఇవ్వాల్సిన నైతిక బాధ్యత పక్కన పెట్టి, వ్యవసాయ క్షేత్రంలో కూర్చొని ప్రభుత్వాన్ని కూల్చే వ్యూహాలు వేయడం నిజంగా ప్రతీ ఒక్కరూ తిప్పి కొట్టాల్సిన విషయమని పలువురు మేధావులు పేర్కొంటున్నారు.
రాజ ద్రోహం…!
భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 124ఏ ని రాజద్రోహ నిబంధనగా పిలుస్తారు. దీని ప్రకారం చట్టబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాటల ద్వారా గానీ, రాతల ద్వారా గానీ, సైగల ద్వారా గానీ, దృశ్య మాధ్యమం ద్వారా గానీ ప్రజల్లో అసంతృప్తిని, విద్వేషాన్ని, ధిక్కారాన్ని రెచ్చగొట్టినా, అందుకు ప్రయత్నించినా రాజద్రోహంగా పరిగణిస్తారు. ఇదే నిర్ధారణ అయితే, గరిష్ఠంగా యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. జరిమానా కూడా విధించవచ్చు. మూడేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు. లేదా కేవలం జరిమానాతో వదిలేయవచ్చు. రాజద్రోహం కేసు పెడితే బెయిలు రాదు.
