సమర్థుడైన పాలకుడు ఉంటేనే ప్రజలకు సుపరిపాలన అందుతుంది, గత అయిదేళ్లుగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్న వారు మూడుముక్కలాటతో ప్రజల బతుకులను ఛిద్రం చేశారని నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ బేతపూడి మల్లెతోటల్లో పనిచేస్తున్న మహిళా కూలీలను కలిసిన ఆమె వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ ఒకప్పుడు రాళ్లు రప్పలతో నిండిన హైదరాబాద్ ను హైటెక్ సిటీ నిర్మాణం ద్వారా విశ్వనగరంగా మార్చిన దార్శనికుడు చంద్రబాబునాయుడు అని, ఎల్లప్పుడూ ప్రజాక్షేమాన్ని కాంక్షించే ఆయన పై తప్పుడు కేసులు బనాయించి 53 రోజులపాటు అక్రమంగా జైలులో నిర్భందించారు, కక్షపూరిత రాజకీయాలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.

రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరగిపోయాయనీ, భద్రతలేక భయంతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. నాసిరకం మద్యం కారణంగా నిరుపేద కుటుంబాలు నాశనమవుతున్నాయనీ, ఒకప్పుడు అన్నపూర్ణగా ఉన్న రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయి క్యాపిటల్ గా మార్చారని, చంద్రబాబు సిఎం అయ్యాక మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతారన్నారు. భారీగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి పన్నులు, కరెంటుబిల్లులతో ప్రజలపై భారం మోపారనీ, అమరావతి విధ్వంసంతో ఇక్కడి ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయనీ, పేద, మధ్య తరగతి ప్రజల ఆదాయాలు పడిపోయాన్నారు. రాబోయే ఎన్నికల్లో అందరి ఆశీస్సులతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాజధాని నిర్మాణం చేపట్టి అమరావతి ప్రాంతానికి గత వైభవం తెస్తారనీ. రాష్ట్రానికి పరిశ్రమలు రప్పించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తారనీ, రాష్ట్రప్రజలు రెండునెలలు ఓపిక పడితే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనీ బ్రాహ్మణి తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో ఇబ్బందుల్లో ఉన్న చేనేతలను ఆదుకునేందుకు నారా లోకేష్ టాటా తనేరియాతో ఒప్పందం చేసుకుని వీవర్స్ శాలను ఏర్పాటు చేశారనీ. అధునాతన మగ్గాలు, డిజైన్లతోపాటు మార్కెటింగ్ సౌకర్యం కల్పించి చేనేతల ఆదాయం పెంచేందుకు కృషిచేస్తున్నారనీ ఆమె చెప్పారు.
