ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వ సహకారంతో ఉభయ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి సాధించేలా వంతు కృషి చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారిని రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించి మనవడి మొక్కులు తీర్చుకున్నారు. వారికి ఆలయ అధికారుల స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేష వసంత సత్కరించారు. శ్రీవారి జ్ఞాపికను అందజేశారు.

ఆలయం వెలుపల రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, త్వరలో ఆంధ్రప్రదేశ్ లో కొలువుదీరే ప్రభుత్వ సహకారంతో, ఉభయ రాష్ట్రాల్లో సమస్యల పరిష్కారానికి చర్చిస్తామన్నారు. అదేవిధంగా తిరుమలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కళ్యాణ మండపం, వసతి గృహం ఏర్పాటుకు నూతన ప్రభుత్వ సహకారం తీసుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం అనుకూలించి రైతాంగం సస్యశ్యామలం కావాలని రేవంత్ ఏడుకొండల స్వామిని కోరారు.
